- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఈసారి అదిరిపోయిన బతుకమ్మ చీరలు.. 25 కలర్స్, 25 డిజైన్లు!

దిశ, తెలంగాణ బ్యూరో: 25 రంగులు, 25 డిజైన్లు, 625 కలర్ కాంబినేషన్లతో బతుకమ్మ చీరెలు సిద్ధమయ్యాయి. రూ. 349 కోట్ల వ్యయంతో కోటి రెండు లక్షల చీరెలను నేయించిన ప్రభుత్వం నేటి నుంచి 18 ఏళ్లు నిండిన ప్రతి ఆడబిడ్డకు పంపిణీ చేయనుంది. ఈసారి ప్రత్యేకంగా వెండి, బంగారు, జరీ అంచులతో నేశారు. సిరిసిల్ల, పోచంపల్లి, గద్వాల్, గర్షకుర్తి, జమ్మికుంట, జగిత్యాల, కరీంనగర్, మంచిర్యాల, ధర్మపురిలోని చేనేత కార్మికులకు చీరెలను నేసి ప్రభుత్వానికి అప్పగించగా ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు సరఫరా చేశారు. ఇందులో 98 శాతం చీరెలను ఒక్క సిరిసిల్లలోనే తయారు చేశారు. 139 మ్యాక్స్ సంఘాలు, 126 ఎస్ఎస్ఐ(స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్) ఇందులో భాగస్వామ్యం కావడం గమనార్హం.
ఆధునిక హంగులతో..
దశాబ్దాలుగా ఉపాధి లేని నేతన్నలకు చేతినిండా పని కల్పించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ చీరెల పంపిణీని చేపట్టింది. 2017 నుంచి సర్కారు పంపిణీ చేస్తున్నది. ఈ ఏడాది లబ్ధిదారుల సంఖ్య పెరగడంతో 1.02 కోట్ల చీరెలను ఆర్డర్ చేసింది. సిద్ధమైన చీరెలను హైదరాబాద్ లోని 10, సిరిసిల్లలోని 2 ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా అధికారులు జిల్లా కేంద్రాలకు తరలించారు. నేటి నుంచి పంపిణీ చేసేందుకు అన్ని చర్యలు చేపట్టారు. నిఫ్ట్ డిజైనర్లతో సరైన డిజైన్ పాటర్న్, ప్రామాణికాలతో మెప్మా, సెర్ప్ కింద స్వయం సహాయక బృందాల మహిళా ప్రతినిధుల అభిప్రాయాలు, సలహాల ఆధారంగా చీరెలను డాబీ, జాకార్డు డిజైన్లతో పాటు కొత్తగా వెండి, బంగారు, జరీ అంచులతో నాణ్యమైన క్వాలిటీతో తయారు చేయించారు. టెస్కో ఆధ్వర్యంలో బీసీ వెల్ఫేర్ శాఖ, రెవెన్యూ అధికారులు తయారీ పర్యవేక్షణ చేశారు. చీరెలన్నీ జరీ అంచులతో 100 శాతం పాలిస్టర్ ఫిలిమెంట్, నూలుతో నేశారు. నాణ్యత, తయారీ, ప్రింటింగ్, కొంగు, బార్డర్లు, ప్యాకేజింగ్ వంటి అంశాలపైన ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.
వారి కోసం ప్రత్యేకంగా...
6.30 మీటర్ల పొడవు గల 94 లక్షల సాధారణ చీరెలకు అదనంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వయోవృద్ధ మహిళల కోసం ప్రత్యేకంగా 9.00 మీటర్లు పొడవు గల 8 లక్షల చీరెలను తయారు చేయించారు. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో 94 లక్షల చీరెలను పంపిణీ చేయనున్నారు. 2017 లో 95,48,439 మహిళలకు, 2018లో 96,70,474 మందికి, 2019లో 96,57,813 మందికి, 2020లో 96,24,384, 2021లో 95,86,000, 2022లో 96,42,554 లక్షల చీరెలను పంపిణీ చేయగా, ఈ ఏడాది 1.20 కోట్ల చీరెలను పంపిణీ చేయనున్నారు.
మంత్రులు, ఎమ్మెల్యేలతో పంపిణీ..
జిల్లా కేంద్రాల్లో మంత్రులు, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. 16వేల మరమగ్గాలతో చీరెలను తయారు చేయించామని, సుమారు 20వేల మంది కార్మికులకు ఉపాధి కల్పించినట్లు పేర్కొన్నారు. మున్సిపాలిటీ, గ్రేటర్ లోని డివిజన్లు, వార్డులతో పాటు గ్రామాల్లోని రేషన్ దుకాణాల్లో పంపిణీకి ఏర్పాట్లు చేశారు. కలెక్టర్ల పర్యవేక్షణలో అర్హులైన ప్రతి మహిళలకు అందేలా టెస్కో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
625 వెరైటీలతో తయారు చేయించాం: యాదగిరి, టెస్కో జీఎం
ఈ ఏడాది 25 సరికొత్త డిజైన్లు, 25 విభిన్న రంగులతో మొత్తం 625 రకాల చీరెలను టెస్కో ఆధ్వర్యంలో తయారు చేయించాం. ఇప్పటికే అన్ని జిల్లాలకు సరఫరా చేశాం. ఈ సారి కోటి 2 లక్షల చీరెలను నేయించాం. సిరిసిల్ల పవర్ లూమ్ క్లస్టర్ లో 16 వేల పవరల్ లూమ్స్ లలో సుమారు 20వేల మంది కార్మికులు పని చేశారు. మాక్స్ సంఘాలు, ఎస్ఎస్ ఐ యూనిట్లలో చీరెలు తయారు చేయించాం.
Read More..