ఎట్టిపరిస్థితుల్లో షేర్‌ చేయొద్దు.. తెలుగు రాష్ట్రాల్లో అనేక మందికి ఫోన్లు: సజ్జనార్

by Ramesh N |
ఎట్టిపరిస్థితుల్లో షేర్‌ చేయొద్దు.. తెలుగు రాష్ట్రాల్లో అనేక మందికి ఫోన్లు: సజ్జనార్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఫెడెక్స్‌ కొరియర్‌ పేరుతో సైబర్‌ మోసాలు వీపరీతంగా పెరుగుతున్నాయని టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు. తాజాగా ఆర్టీసీ మహిళా ఉద్యోగికి ఫోన్‌ చేసి సైబర్‌ నేరగాళ్లు భయభ్రాంతులకు గురిచేశారని తెలిపారు. మలేషియాకు చెందిన ఒకరికి ఆమె కొరియర్‌ను బుక్‌ చేశారని, అందులో 1.40 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌, 16 ఫేక్‌ ఫాస్‌ పోర్టులు, 58 డెబిట్‌ కార్డులున్నాయంటూ న్యూఢిల్లీ ఎయిర్‌ పోర్ట్‌ కస్టమ్స్‌ అధికారినంటూ ఇటీవల కాల్‌ చేశారన్నారు. కొరియర్‌ లో నిషేధిత డ్రగ్స్‌ ఉన్నందున తనపై కేసు నమోదైందని బెదిరించాడన్నారు. మీరు విచారణకు ఢిల్లీకి తప్పకుండా రావాల్సిందేనని భయపెట్టాడని పేర్కొన్నారు.

అంతటితో ఆగకుండా పోలీసులంటూ బెదిరించి స్పైప్‌ వీడియో కాల్‌ లో పాల్గొనేలా చేశారని, ఈ కేసు నుంచి బయటపడాలంటే, తాము అడిగినంత ఇవ్వాలని చెప్పారన్నారు. ఆధార్‌ కార్డుతో పాటు బ్యాంక్‌ ఖాతాల వివరాలు అడగడంతో ఆమెకు అనుమానం వచ్చిందన్నారు. మోసమని గుర్తించి వారితో గొడవకు దిగి స్కైప్‌ వీడియో కాల్‌ నుంచి బయటకు వచ్చారని, వెంటనే ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకువచ్చారని వివరించారు. ఇలా తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేక మందికి సైబర్‌ నేరగాళ్లు ఫోన్లు చేసి.. మోసాలు చేస్తున్నారని తెలిపారు. అనుమానస్పదంగా అనిపించే ఫోన్‌ కాల్స్‌కు మీరు స్పందించొద్దని, వ్యక్తిగత సమాచారాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ షేర్‌ చేయొద్దని సూచించారు. ఒకవేళ సైబర్‌ మోసాల్లో చిక్కుకున్నామని ఏమాత్రం అనుమానం వచ్చిన వెంటనే 1930కి కాల్‌ చేయాలని, ఫెడెక్స్‌ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండండని సూచించారు.



Next Story