- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
సిగ్గుతో తలవంచుకునే పరిస్థితి.. సర్కార్పై RS ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు

దిశ, వెబ్డెస్క్: నీటిపారుదల, వ్యవసాయ, పట్టణాభివృద్ధి, రియల్ ఎస్టేట్ రంగాలను నాశనం చేసినట్టే విద్యారంగాన్ని కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం(Revanth Reddy Government) నాశనం చేస్తోందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. పరిగి నియోజకవర్గం కుల్కచర్లలో విద్యార్థి మరణం, అలాగే బాలానగర్లో ఆరాధ్య అనే విద్యార్థిని ఆత్మహత్య చాలా బాధించాయని అన్నారు. విద్యార్థుల మరణాలు అందర్నీ కలిచివేస్తున్నా.. ప్రభుత్వ పెద్దల్లో చలనం లేదని మండిపడ్డారు. గురుకులాల్లో పరిస్థితులు సిగ్గుతో తలవంచుకునేలా మారాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గురుకులాల్లో ప్రవేశానికి కేసీఆర్(KCR) హయాంలో ఒక్క సీటుకు ముగ్గురు అభ్యర్థులు పోటీ పడేవారు.. ఇపుడు రేవంత్ హయంలో పరిస్థితి తలకిందులు అయ్యాయి.. గురుకులా(Gurukul Schools)ల్లో ఐదో తరగతి ప్రవేశ పరీక్షకు 40 వేల సీట్లకు 80 వేల మంది కూడా అప్లై చేసుకోలేదు.. మూడు సార్లు గడువు తేదీ పొడగించినా స్పందన లేదని ఎద్దేవా చేశారు.
విద్యాశాఖ మంత్రి పదవిని రేవంత్ రెడ్డి తీసుకున్నది విద్యారంగాన్ని కూకటి వేళ్ళతో పెకలించడానికా? అని ప్రశ్నించారు. ఎంట్రన్స్ టెస్ట్ పెడితే రేవంత్ రెడ్డికి వచ్చిన నొప్పేమిటని అడిగారు. విద్యారంగంపై రేవంత్కు కనీస అవగాహన లేదని అన్నారు. కేసీఆర్ హయంలో 30కి పైగా ప్రతిభా పాఠశాలలు నెలకొల్పారు. ప్రతిభా పాఠశాలల నుంచి ఎంతో మంది డాక్టర్లు, ఇంజినీర్లు తయారయ్యారు. ఇపుడు ప్రతిభా పాఠశాలలను రద్దు చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో గురుకుల సిబ్బందికి ప్రతి నెల మొదటి వారంలో జీతాలు వచ్చాయి.. ఇపుడా పరిస్థితి లేదని అన్నారు.
సైనిక దళాల్లో చేరేందుకు కేసీఆర్ హయంలో భువనగిరిలో ప్రత్యేక పాఠశాల మొదలు పెడితే ఇపుడు దాన్ని నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనుమానం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో గురుకులాల్లో చదివిన విద్యార్థులు డాక్టర్లుగా తయారు అయ్యారని.. కానీ ఇప్పుడు డాక్టర్ చదవడానికి వచ్చిన 57 మంది విద్యార్థులు శవాలుగా మారారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గురుకులాల్లో విద్యార్థుల అనీమియాతో చనిపోతున్నారని అన్నారు. గురుకులంలో చదివిన రజక కులానికి చెందిన విద్యార్థిని నందిని బ్యాడ్మింటన్లో నేషనల్ గేమ్స్లో బంగారు పథకం సాధిస్తే ఆమెకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రోత్సాహకం ప్రకటించలేదు.. బీసీ విద్యార్థిని అయినందుకే నందినిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదా? అని ప్రశ్నించారు. తక్షణమే నందినికి కోటి రూపాయల నజరానా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వానికి సిరాజ్, జరీన్ లే కనిపిస్తున్నారా? అని అడిగారు. నాగర్ కర్నూల్ జిల్లాలో ఓ గురుకుల పాఠశాలలో ఇద్దరు విద్యార్థినులు ఫుడ్ పాయిజన్కు గురయ్యారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తే వారితో పాటు ఓ న్యూస్ ఛానల్ రిపోర్టర్పై కేసు పెట్టారని మండిపడ్డారు. ఆ ఇద్దరు విద్యార్థినులను కూడా పోలీస్ స్టేషన్లో రెండు గంటలు విచారించారు.. చదువుకోవాల్సిన విద్యార్థినులను పోలీస్ స్టేషన్లో పెడతారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ది దుర్మార్గపు పాలన అని.. ఆయన్ను ఎంత తొందరగా ఇంటికి సాగనంపితే అంత మంచిదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అభిప్రాయపడ్డారు.