బీఆర్ఎస్ పాలనలో ఇలాంటి దాడులు లేవు

by Disha Web Desk 22 |
బీఆర్ఎస్ పాలనలో ఇలాంటి దాడులు లేవు
X

దిశ, మెదక్ టౌన్: బీఆర్‌ఎస్ కౌన్సిలర్ ఇంటి పై దాడినీ ఖండిస్తూ మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి ఖండించారు. మెదక్ జిల్లా బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి మాట్లాడే హక్కు ఉంటుందని, ఆంజనేయులు ముఖ్య కార్యకర్తల సమావేశంలో తన ఆవేదన చెప్పడంతో దాన్ని ఆపాదించుకోవడం సరికాదన్నారు. ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని అన్నారు. ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో కాంగ్రెస్ నాయకులు ఇలా దాడులతో ప్రజలకు ఏం సందేశాన్ని ఇస్తున్నారని వారు ప్రశ్నించారు. మున్సిపల్ సమావేశంలో కూడా ఒక ప్రజా ప్రతినిధి పై ఎమ్మెల్యే తాను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకపోవడం అతని అవమానించడం సమంజసం కాదన్నారు. నియోజకవర్గంలో వర్షాలకు పంట నష్టం జరిగిన రైతులను పరామర్శించి వారికి అందాల్సిన పంట నష్టం సహాయాన్ని అందించే విధంగా కృషి చేయాలన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను పూర్తి స్థాయిలో అమలు చేసే విధంగా చొరవ చూపాలి కానీ ప్రతిపక్షాల నాయకుల పై దాడులు చేయడం ఇదే మర్యాదని వారు అన్నారు. ఎన్నికల ముందు తన సొంత డబ్బులతో ఎన్నో పనులు చేస్తానని చెప్పిన స్థానిక ఎమ్మెల్యే వాటిపై దృష్టి పెట్టాలన్నారు. బీఆర్ఎస్ నాయకులకు దాడులు చేసినంత మాత్రాన భయపడమని కేసులు మాకు కొత్తేం కాదని తెలంగాణ ఉద్యమంలో 14 సంవత్సరాలు పోరాడి ఉద్యమ పార్టీ అని అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి పెద్ద బలగం ఉంది, దాంతోపాటు మాకు ప్రజల అండ కూడా ఉందనీ ఏం ఎవరికి భయపడమని అన్నారు. కాంగ్రెస్ నాయకులు దాడికి పాల్పడినందుకు గాను జిల్లా ఎస్పీకి, జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్పర్సన్ లావణ్య రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున గౌడ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గంగాధర్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రాగి అశోక్, కౌన్సిలర్ మామిళ్ల ఆంజనేయులు, జయరాజ్, కిషోర్, బీఆర్ఎస్ నాయకులు రాజు, లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed