దళిత మహిళలు మొక్కితే వినాయకుడు మైల పడతాడా...?

by Sumithra |
దళిత మహిళలు మొక్కితే వినాయకుడు మైల పడతాడా...?
X

దిశ, మెదక్ ప్రతినిధి : దళిత మహిళలు మొక్కితే వినాయకుడు మైల పడతాడా అని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ సూటిగా ప్రశ్నించారు. ఆదివారం హవేలి ఘనపూర్ మండలం శమ్నపూర్ గ్రామాన్ని దళిత బహుజన ఫ్రంట్, మానవ హక్కుల వేదిక బృందం సందర్శించారు. అనంతరం వినాయకుడిని మొక్కడానికి వెళ్ళిన దళిత మహిళలను కులం పేరుతో దూషించి దాడి చేసిన సంఘటన పై వివరాలను బాధిత దళితులను, దళితేతరులను కలిసి తెలుసుకొని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ మాట్లాడుతూ గ్రామానికి చెందిన దళిత మహిళ కొమ్మాట భాగ్యమ్మ, ఆమె కూతురు అంజలితో కలిసి గత ఆదివారం సాయంత్రం గ్రామ కషీర్ వద్ద వున్న వినాయకుడిని మొక్కి కొబ్బరికాయ కొట్టడానికి వెళ్ళింది. కాగా అదే గ్రామానికి చెందిన తిరుపతి రెడ్డి, యాదవరెడ్డి, పట్నం చంద్రశేఖర్ లు అడ్డుకొని మాదిగలు వినాయకుడిని మొక్కుతారా అంటు బూతుమాటలు తిట్టి అవమానపర్చడం సిగ్గు చేటన్నారు. ఈ సంఘటన విషయం తెలుసుకొని అక్కడికి వెళ్లి ప్రశ్నించిన భాగ్యమ్మ భర్త సిద్దిరాములు పై దాడి చేయగా అడ్డు చెప్పిన భాగ్యమ్మ, అంజలి పై కూడా దాడి చేశారన్నారు.

ఈ సంఘటన పై బాధితుల ఫిర్యాదు మేరకు హవేలి ఘనపూర్ పొలీసులు ఎస్సీ,ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసునమోదు చేశారన్నారు. బాధితుల పై అక్రమంగా బనాయించిన కౌంటర్ కేసులను ఎత్తి వెయాలని డిమాండ్ చేశారు. దేవుడు, దయ్యాల పేరుతో దళితులు కాలం వృధా చేసుకొవద్దని పిల్లలను ఉన్నత చదువులు చదివించి ఆత్మగౌరవంతో జీవించాలన్నారు. దళిత మహిళల పై దాడి చేసిన నిందితుల పై కఠిన చర్యలు తీసుకొవాలని మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్ ను కోరగా సోమవారం నాడు గ్రామానికి వెళ్ళి విచారణ చేసి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మానవ హక్కుల వేదిక రాష్ట్ర నాయకులు అహ్మద్, డీబీఎఫ్ జిల్లా అధ్యక్షుడు దుబాషి సంజీవ్, డీబీఎఫ్ జిల్లా కార్యదర్శి హన్మకొండ దయాసాగర్, ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు రవి బాధితులు భాగ్యమ్మ, సిద్దిరాములు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story