ప్రభుత్వ ఆసుపత్రిలో 14 మంది వైద్య సిబ్బందికి షోకాజ్ నోటీసులు…

by Kalyani |
ప్రభుత్వ ఆసుపత్రిలో 14 మంది వైద్య సిబ్బందికి షోకాజ్ నోటీసులు…
X

దిశ, గద్వాల కలెక్టరేట్ : ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో పనిచేసే వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ బీఎం. సంతోష్ వైద్య సిబ్బందికి ఆదేశించారు. మంగళవారం జిల్లా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని ప్రతి వార్డును సునిశితంగా పరిశీలించి అక్కడి పరిస్థితులు, రోగులకు అందిస్తున్న వైద్య సేవలను క్షణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా డాక్టర్ లు ఎంత మంది నిర్దేశిత సమయానికి వచ్చారని రిజిస్టర్ లో పరిశీలించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ట్యూటర్లు 14 మందితో పాటు మరో నలుగురు వైద్య సిబ్బంది గైర్హాజరు పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిరోజు వారి హాజరు వివరాలను తెలిపే బయోమెట్రిక్ యంత్రంలో గల వారి వివరాలను ప్రింట్ తీసి ఇవ్వాల్సిందిగా ఇంచార్జ్ సూపరింటెండెంట్ కు కలెక్టర్ ఆదేశించారు.

విధులు సరిగా నిర్వహించని 14 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. అలాగే ఫార్మసి స్టోర్ తనిఖీ చేసి స్టాక్ వివరాలు, రిజిస్టర్లు సరిగా నిర్వహించకపోవడం పట్ల ఫార్మసిస్ట్ ను వెంటనే సస్పెండ్ చేయాలని ఆదేశించారు. కంటి వైద్య చికిత్సకు సంబంధించిన ల్యాబ్ ను పరిశీలించి, కంటి సమస్యలతో వచ్చే పేషెంట్లకు వెంటనే మెరుగైన చికిత్సలు అందించే విధంగా ఆపరేషన్ థియేటర్ ను జులై, 1 నుంచి పని చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. 50 పడకల వార్డు లో పేషెంట్లను (పురుషులను) అందులోకి షిఫ్ట్ చేసి వినియోగంలోకి తీసుకురావాలన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రికి వచ్చే ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్స్ నమోదు వివరాలు తెలిపే రికార్డులను పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చే పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఈ సందర్భంగా కలెక్టర్ వైద్యాధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి ఇంచార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ నవీన్ క్రాంతి, వైద్య బృందం, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed