సీఎం పర్యటన ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలి

by Sridhar Babu |
సీఎం పర్యటన ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలి
X

దిశ, వంగూర్ : సీఎం పర్యటన ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశించారు. మండల పరిధిలోని కొండారెడ్డిపల్లి గ్రామంలో వివిధ శాఖల వారీగా జరుగుతున్న అభివృద్ధి పనులు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన తదితర అంశాలపై అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, కొండారెడ్డిపల్లి గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ ముఖ్యమంత్రి సోదరుడు కృష్ణారెడ్డి, జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ లతో కలిసి జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ మంగళవారం పర్యటించారు. అనంతరం కొండారెడ్డిపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి రాక సందర్భంగా హెలిప్యాడ్ ఏర్పాట్లను పరిశీలించి, గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఇంజనీరింగ్, ఇరిగేషన్, రెవెన్యూ ,ఆర్అండ్ బీ, పంచాయతీరాజ్, మిషన్ భగీరథ, పోలీస్ తదితర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు జిల్లా కలెక్టర్ సంతోష్ ఆదేశించారు.

ఈనెల 12వ తేదీన గ్రామంలో జరిగే దసరా ఉత్సవాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొండారెడ్డిపల్లి గ్రామానికి వస్తారని తెలిపారు. గ్రామంలో గత కొన్ని రోజుల నుంచి జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులతో చర్చించారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్ట మొదటిసారిగా రేవంత్ రెడ్డి సొంత గ్రామానికి వస్తున్నందున ఘనంగా స్వాగతం పలకాలని కోరారు. అనంతరం జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రాక సందర్భంగా ట్రాఫిక్, పార్కింగ్ ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా పోలీసు అధికారులకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు. భద్రతాపరమైన అంశాల పట్ల పలు సూచనలు చేశారు. సంబంధిత శాఖ, పోలీసు అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. సమన్వయంతో పనిచేసి గ్రామ అభివృద్ధికి కృషి చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ ముఖ్యమంత్రి సోదరుడు కృష్ణారెడ్డి అభినందనలు తెలిపారు. తాము కూడా ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని పేర్కొన్నారు. వారి వెంట వివిధ శాఖల అధికారులు, గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed