భూ భారతి తో రైతాంగ సమస్యలకు సత్వర పరిష్కారం : కలెక్టర్ జితేష్ వి పాటిల్

by Aamani |   ( Updated:2025-04-20 10:00:55.0  )
భూ భారతి తో రైతాంగ సమస్యలకు సత్వర పరిష్కారం  : కలెక్టర్ జితేష్ వి పాటిల్
X

దిశ,ఇల్లందు: తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి చట్టం తో రైతాంగ సమస్యలు సత్వరమే పరిష్కారం అయ్యేందుకు మార్గం సుగమమైందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ఇల్లందు మండలం బొజ్జాయి గూడెం లో భూభారతిపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఎమ్మెల్యే కోరం కనకయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతాంగ భూ సమస్యలు పరిష్కారానికి గతంలో సరైన చట్టం లేక రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని అన్నారు. ప్రస్తుత భూ భారతి చట్టంతో రైతులు తమ భూ సమస్యలకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఉన్న సత్వరమే పరిష్కారం అయ్యే విధంగా భూభారతిలో అవకాశం కల్పించడం జరిగిందని అన్నారు. ఆదివాసీ చట్టం సత్వర పరిష్కారానికి సులభమైన మార్గం చూపిస్తుందని తెలిపారు. ధరణి పోర్టల్లో తప్పుల సవరణకు రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని ఇప్పుడు ఆ ఇబ్బందులు ఉండవన్నారు.

భూ భారతి చట్టంపై రైతులు స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలన్నారు. రిజిస్ట్రేషన్ న్యూటేషన్,సర్వే నెంబర్లు రైతులు కలిగి ఉన్న గట్టు పంచాయతీలతో రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగిన ఫలితం ఉండేది కాదని ఇప్పుడు ఆ సమస్యను గ్రామస్థాయిలోని గ్రామ పాలన అధికారి విచారణతో పరిష్కారానికి మార్గం సుగుమంకానున్నదని తెలిపారు. జిల్లాలో తొమ్మిది లక్షలకు పైగా సాదా బైనామా పెండింగ్ కేసులు ఉన్నాయని ఇప్పుడు భూభారతితో పూర్తిస్థాయి విచారణ చేపట్టి వాటికి పరిష్కారం చూపిస్తామన్నారు. వారసత్వంగా వచ్చిన భూములకు మ్యుటేషన్ చేసే ముందు నిర్ణీత కాలంలో విచారణ చేపట్టి రైతులకు సరైన న్యాయం జరుగుతుందన్నారు. ఇంటి స్థలాలు, ఆబాది, వ్యవసాయేతర భూములకు సంబంధించి స్పష్టమైన భూభారతిలో చట్టం తీసుకొచ్చారని ఈ చట్టం ద్వారా సంవత్సరాల తరబడి ఇబ్బంది పడుతున్న వారికి న్యాయం జరుగుతుందన్నారు.

రైతులకు అందించే పాస్ పుస్తకాలలో రైతుకు సంబంధించిన భూమి మ్యాప్ సైతం పొందుపరచడం జరుగుతుందని దీనివల్ల ఒకే స్థలాన్ని పలువురికి అమ్మే మోసపూరిత వ్యక్తులకు చెక్ పడనందని తెలిపారు. భూభారతి చట్టంతో ఆదివాసి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని భూ భారతి ఆదివాసి చట్టాలకు అనుగుణంగా భూభారతి పోర్టల్ ను రూపొందించడం జరిగిందని ఆదివాసీలు ఎటువంటి అపోహలకు పోవద్దన్నారు. ధరణి పోర్టల్ వల్ల ఆరు ఏడు సంవత్సరాల నుంచి రైతులు ఇబ్బందులు పడుతున్నారని భూభారతితో ఆ సమస్యలు పరిష్కారం అవుతాయని స్పష్టం చేశారు. భూభారతి పోర్టల్ పూర్తిగా ప్రభుత్వమే నిర్వహిస్తుందని గతంలో ధరణి పోర్టులను ప్రైవేటు సంస్థ నిర్వహించడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామన్నారు. ఈ అవగాహన సదస్సులో ఆర్డీవో మధు, ఎంపీడీవో దన్ సింగ్, వ్యవసాయ అధికారి, తహసిల్దార్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

భూభారతి చట్టం రైతులకు కొండంత ధైర్యం : ఇల్లందు ఎమ్మెల్యే

కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త చట్టం భూ భారతి తో రైతుల భూ సమస్యల కొండంత ధైర్యం ఇస్తుందని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. ఇల్లందు మండలం బొజ్జయిగూడెం పంచాయతీలో ఎస్ ఎస్ గార్డెన్ లో ఆదివారం భూభారతి అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. భూ సంబంధిత సమస్యలతో రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని, భవిష్యత్తులో సమస్యలు తలెత్తి కూడదనే, ప్రభుత్వం కొత్త చట్టం తెచ్చింది అన్నారు. భూ సమస్యలు మార్పులు చేర్పులు, మ్యుటేషన్, ఇతర సమస్యలకు ఈ భూభారతి చట్టం పరిష్కారం చూపుతుందన్నారు. ఈ చట్టం రైతులకు మాత్రమే కాదని, రెవెన్యూ అధికారులకు కూడా ధైర్యం ఇచ్చిందన్నారు. సమస్య ఎంత తీవ్రమైనదైనా నాలుగు అంచెల్లో పరిష్కారం లభిస్తుందన్నారు. ఈ చట్టంపై రైతులు, ప్రజలు అవగాహన కల్పించేందుకే సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.






Next Story