Flood : పెద్దవాగు ప్రాజెక్టుకు భారీ గండి.. రాత్రికి రాత్రే ఖాళీ అయిన ప్రాజెక్ట్

by Aamani |
Flood : పెద్దవాగు ప్రాజెక్టుకు భారీ గండి.. రాత్రికి రాత్రే ఖాళీ అయిన ప్రాజెక్ట్
X

దిశ, అశ్వారావుపేట : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం గుమ్మడవెల్లి పెదవాగు ప్రాజెక్టుకు భారీ గండి పడింది. గురువారం రికార్డు స్థాయిలో 113 మిల్లీమీటర్ల వర్షపాతానికి ప్రాజెక్టు సామర్థ్యానికి మించి వరద నీరు వచ్చి చేరింది. అధికారులు ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తి 23 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. మధ్యాహ్నానికి వరద ఉగ్రరూపం దాల్చి జలప్రళయం గా మారింది. మునుపెన్నడూ లేని విధంగా ప్రాజెక్టు ఆనకట్టలు మీదుగా వరద నీరు పొంగి ప్రవహించింది. ప్రాజెక్టు గేట్లు ఎత్తి వరద నీటిని నిరవధికంగా విడుదల చేస్తున్న ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో రాత్రికి ప్రాజెక్టుకు ఆనకట్టలు తెగిపోయే పరిస్థితులు ప్రమాదకర ఏర్పడ్డాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్టు దిగువ గ్రామాలలోని ప్రజలను ఖాళీ చేయించారు.

అర్ధరాత్రి పెద్దవాగు ప్రాజెక్టు కుడి వైపు తుముకి భారీ గండి పడి ఆనకట్ట వరదలో కొట్టుకుపోయింది. దీంతో ప్రాజెక్టు పూర్తిగా ఖాళీ అయిపోయింది. అశ్వారావుపేట మండలం గుమ్మడవెల్లి, కోయ రంగాపురం, కొత్తూరు, రమణక్కపేట గ్రామాలకు పాక్షికంగా నష్టం వాటిల్లగా.. ఏపీలోని ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కమ్మరిగూడెం, ఒంటిబండ, కోయమాచారం, కొత్తపూచిరాల, పాతపూచిరాల, అల్లూరి నగర్, పొంది గొల్లగూడెం, వసంతవాడ, గుళ్లవాయి, వేలేరుపాడు గ్రామాలకు భారీగా నష్టం సంభవించింది. వేల ఎకరాల్లో పంట దెబ్బతిన్నది. వందల సంఖ్యలో పశువులు కొట్టుకుపోయాయి. జలగం వెంగళరావు చొరవతో నిర్మాణం మొదలై 1981 నుంచి అందుబాటులోకి వచ్చి.. 41 సంవత్సరాలుగా 15 వేల ఎకరాల ఆయకట్టు సాగుకు నీరు అందిస్తున్న వరప్రదాయని పెద్దవాగు ప్రాజెక్టు గండిపడి నిరుపయోగంగా మారింది. ప్రాజెక్టు ఆధారిత రైతాంగం భవిష్యత్తు ప్రశ్నార్థకమయ్యింది. ప్రాజెక్టు ఆయకట్టులో రెండు వేల ఎకరాలు తెలంగాణలో.. 13 వేల ఎకరాల భూభాగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. దీంతో తెలంగాణ రాష్ట్ర పునర్విభజన తర్వాత ప్రాజెక్టు నిర్వహణ మరమ్మతులలో నిర్లక్ష్యం జరిగింది. ఇటీవల ఆరు నెలల క్రితం రూ. 2 కోట్లతో మరమ్మతులు చేపట్టినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది.

ప్రాజెక్టు పునరుద్ధరణకు ఏడాదిపైనే

పెద్దవాగు ప్రాజెక్ట్ కరకట్ట రెండున్నర కిలోమీటర్లు ఉండగా.. 500 మీటర్లు గండిపడి వరదల్లో కొట్టుకుపోయింది. మరో కిలోమీటర్ మేర వరద ధాటికి పాక్షికంగా ధ్వంసం అయింది. మొత్తం మీద ఐదు చోట్ల పెద్ద ఎత్తున ప్రాజెక్టు కరకట్ట దెబ్బతింది. ప్రాజెక్టును పునరుద్ధరించాలంటే మరో ఏడాది పైబడి సమయం పట్టవచ్చని తెలుస్తుంది.

ప్రాజెక్టును పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యే

జలప్రళయానికి గండిపడి ధ్వంసమైన పెదవాగు ప్రాజెక్ట్ కరకట్టను జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్ లతో కలిసి, ఎమ్మెల్యే జారె ఆదినారాయణ శుక్రవారం పరిశీలించారు. ఆనకట్ట గండి పడటానికి గల కారణాలు ఇరిగేషన్ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్ట్ పునరుద్ధరణ పనులు భవిష్యత్ కార్యచరణపై చర్చించారు. అనంతరం పెదవాగు వరద ముంపు గ్రామాలను ఎమ్మెల్యే జారె సందర్శించారు. వరద ధాటికి దెబ్బతిన్న రోడ్లు వంతెనలను పరిశీలించారు. ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని వరద బాధితులకు ఎమ్మెల్యే ధైర్యం చెప్పారు.





Next Story