MLA Adi : మీపై కోపంతో ప్రజలే మిమ్మల్ని పక్కన పెట్టారు

by Kalyani |
MLA Adi : మీపై కోపంతో ప్రజలే మిమ్మల్ని పక్కన పెట్టారు
X

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : కల్వకుంట్ల కుటుంబం పై కోపంతో కాంగ్రెస్ సర్కార్ ఏలాంటి సంక్షేమ పథకాలను పక్కన పెట్టలేదని, మీపై కోపంతోనే రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ ను అధికారంలో నుంచి పక్కన పెట్టారని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. గురువారం కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ జిల్లా కేంద్రంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ కేటీఆర్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ మాట్లాడితే ఉప ఎన్నికలు అంటున్నాడని, ఉప ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ పార్టీ నామరూపాలు లేకుండా కనుమరుగైపోతుందని, మొన్నటి కంటోన్మెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఘన విజయం సాధించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇక రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీలో మిగిలేది ఆ నలుగురేనని స్పష్టం చేశారు.

రేవంత్ రెడ్డి మొగోడు కాబట్టే రాష్ట్రంలో పాదయాత్ర చేసి చేసి, మీ అవినీతి అక్రమాలను బయటపెట్టి బీఆర్ఎస్ ను గద్దెదించాడన్నారు. అవినీతి, అక్రమాలకు బతుకమ్మ చీరల పథకం అడ్డుగా పెట్టుకొని, నేతన్న బతుకులతో ఆడుకున్నావని మండిపడ్డారు. నేతన్నలకు ఆర్డర్లు ఇచ్చి రూ.197 కోట్ల బకాయిలు పెట్టింది మీరు కాదా అంటూ ప్రశ్నించారు. 7 లక్షల కోట్ల అప్పు ఇచ్చిన బతుకమ్మ చీరల బకాయిలు చెల్లించి, ప్రతి నెల ఉద్యోగులకు ఒకటో తారీకున జీతం ఇస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పారన్నారు. యారన్స్ సబ్సిడీతో పాటు నేతన్నకు చేయూత పథకం కింద రూ. 90 కోట్ల బకాయిలను విడుదల చేసి, ఇప్పటికే స్కూల్ యూనిఫామ్స్, పోలీస్ యూనిఫామ్స్ బట్ట ఆర్డర్లను సిరిసిల్ల నేతన్నలకు ఇచ్చామన్నారు. ముఖ్యమంత్రి మహిళా సంఘాల్లోని మహిళలకు ఏడాదికి రెండు నాణ్యమైన చీరలు ఇస్తామని హామీ ఇచ్చారని, నేతన్నలను ఆదుకునేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని తెలిపారు.

ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలైనా రేవంత్ రెడ్డి ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా అధికారుల సూచనలతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారని కొనియాడారు. హైడ్రాతో కబ్జాలకు గురైన నాళాలు, చెరువులను కాపాడుతున్నామన్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ నేతలు స్కీముల్లో చేసినవన్నీ స్కాములేనని, జిల్లాలో జరిగిన అవినీతి అక్రమాలు, అవకతవలు బయటపెడతామని సవాల్ విసిరారు. కేటీఆర్ మాటలు రోజురోజుకు కోటలు దాటుతున్నాయని, అధికారం పోయిన పొగరు, అహంకారం మాటలు ఇంకా మారాలేదన్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ కు ప్రజలకు ఫెవికల్ బంధం ఏర్పడుతున్న తరణాన్ని ఓర్వలేకే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, ఇకపై ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలపై వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఇప్పటికైనా కేటీఆర్ తన వైఖరి మార్చుకొని ప్రజల కోసం పోరాడాలని సూచించారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Next Story