- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపిస్తా

దిశ, గోదావరిఖని : రామగుండం నియోజకవర్గంను అన్ని రకాలుగా అభివృద్ధి చేసి తీరుతానని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్సింగ్ అన్నారు. ఆదివారం గోదావరిఖని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలోని రామగుండం, పాలకుర్తి, అంతర్గాం మండలాలకు సంబంధించిన 148 మంది కళ్యాణ లక్ష్మీ, 23 మంది షాదీ ముబారక్ కు చెందిన రూ.కోటి 71 లక్షల విలువైన చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు. నియోజకవర్గాన్ని ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికీ ఐదోసారి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశామని ఆయన స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పేరు గొప్ప ఊరు దిబ్బ లాగా తయారు చేసిన ఈ ప్రాంతాన్ని సుందరీకరణ చేసే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సూచనలతో కోట్లాది రూపాయల నిధులను వెచ్చించి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామన్నారు. ప్రధానంగా ప్రభుత్వ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అర్హులైన వారికి ఎప్పటికప్పుడు అందిస్తున్నామన్నారు. గోదావరిఖని పట్టణంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. కొద్ది రోజుల్లోనే వ్యాపార వర్గాలకు అందుబాటులోకి వచ్చే విధంగా నిర్మాణాలు చేపడుతున్నామన్నారు. ఓవైపు అభివృద్ధికి అడుగులు వేస్తుంటే కాలం చెల్లిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. వారికి ఇప్పటికే ప్రజలు బుద్ధి చెప్పారని, అయినప్పటికీ వారి ధోరణి మార్చుకోవడం లేదని అన్నారు.
ప్రధానంగా పట్టణ వ్యాపార కేంద్రాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. కొద్ది రోజులు ఇబ్బందులు ఉన్నప్పటికీ భవిష్యత్తులో మంచి ఫలితాలను చూస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలనలో భాగంగా ప్రతి ఒక్కరూ నేరుగా తమ సమస్యలు చెప్పుకునే వీలుగా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. అలాగే ప్రభుత్వ అధికారులను సైతం అలర్ట్ చేస్తున్నామని చెప్పారు. అభివృద్ధి విషయంలో ఎక్కడా వెనుకడుగు వేసే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.