తెలంగాణలో విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలి : ప్రొఫెసర్ కోదండరాం

by Sridhar Babu |
తెలంగాణలో విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలి : ప్రొఫెసర్ కోదండరాం
X

దిశ, జగిత్యాల టౌన్ : తెలంగాణలో విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్​ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాలన సక్రమంగా లేదని, కొంతమంది కాంట్రాక్టర్లకు కొమ్ము కాసే విధంగా, కమిషన్ల కోసమే పాలన కొనసాగుతుందని విమర్శించారు. శనివారం జగిత్యాల జిల్లాలో పర్యటించిన కోదండరాం పట్టణంలోని పెన్షనర్స్ భవన్ లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ కరెంట్ కోతలపై ప్రభుత్వ తీరును ఎండగట్టారు. రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు పెద్ద ఎత్తున బకాయిలు ఉండడం వల్ల విద్యుత్ సంస్థలు సరిపడా విద్యుత్​ తయారు చేసే పరిస్థితులలో లేవని, మరోవైపు కొనుగోలు చేసే శక్తి లేకనే విద్యుత్ కోతలు విధిస్తున్నారని తెలిపారు. దీంతో రాష్ట్రంలోని రైతులు సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం డిస్కం లకు బకాయి ఉన్న డబ్బులు వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యుత్ కోతల పట్ల ప్రభుత్వ తీరును నిరసిస్తూ రాష్ట్రంలోని అన్ని విద్యుత్ భవనాల ముందు సోమవారం తెలంగాణ జన సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టనున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో జర్నలిస్టులకు ప్రభుత్వం ఇండ్ల స్థలాలు ఇవ్వలేదని ఈ పరిస్థితి జగిత్యాలలో మరింత దయనీయంగా ఉందన్నారు. కాబట్టి జర్నలిస్టులకు వెంటనే ఇండ్ల స్థలాలు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. కొద్ది నెలల క్రితం విధి నిర్వహణలో భాగంగా వరదల్లో కొట్టుకుపోయి చనిపోయిన జగిత్యాల జర్నలిస్ట్ జమీర్ కుటుంబంతో పాటు ఆర్థిక ఇబ్బందులతో ఇటీవలే ఇద్దరు కూతుర్లతో సహా ఆత్మహత్య చేసుకున్న రైతు జలపతి రెడ్డి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

Next Story