- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఈ అభివృద్ధిలో భాగస్వామ్యం అవ్వడం సంతృప్తినిచ్చింది.. కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

దిశ, వెబ్ డెస్క్: సింగరేణి సంస్థ చరిత్రలో ఇదొక చారిత్రాత్మక ఘట్టమని, ఈ అభివృద్ధిలో భాగస్వామ్యం అవ్వడం సంతృప్తినిచ్చిందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి (Union Minister Kishan Reddy) పేర్కొన్నారు. బుధవారం ఒడిశా (Odisha)లోని నైని బొగ్గు బ్లాక్ (Naini Coal Block)ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM bhatti Vikramarka) వర్చువల్ గా ప్రారంభించారు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన కేంద్రమంత్రి.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ చొరవలో తాను భాగస్వామి అయినందుకు ఆనందం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన.. మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రం అవతల బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించడం సింగరేణి (Singareni) సంస్థ చరిత్రలో ఒక చరిత్రాత్మక ఘట్టమని అన్నారు. 136 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన సింగరేణి సంస్థ తెలంగాణ రాష్ట్రానికి వెలుపల మొట్టమొదటిసారి ఒడిషాలోని నైని బ్లాక్ లో బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించిందని, బొగ్గు ఉత్పత్తిని విస్తరించడం పట్ల, భారత ఇంధన లభ్యత, ఆర్థిక ప్రగతిలో నానాటికీ పెరుగుతున్న తన భాగస్వామ్యం పట్ల సింగరేణి సంస్థకు ఇది గర్వించదగిన క్షణమని హర్షం వ్యక్తం చేశారు.
నైని బొగ్గు బ్లాకులో ఉత్పత్తిని ప్రారంభించటానికి ఉన్న అవరోధాలను తొలగించటానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం (Narendra Modi) తరపున, బొగ్గు మంత్రిత్వశాఖ తరపున అవసరమైన చర్యలు తీసుకోవడం ద్వారా సంస్థ అభివృద్ధిలో భాగమవ్వడం వ్యక్తిగతంగా తనకు సంతృప్తిని కలిగించిందని చెప్పారు. ఇక సింగరేణి సంస్థ తన విజయపరంపరను ఇలాగే కొనసాగించాలని, మరెన్నో మైలురాళ్లను అధిగమించాలని కోరుకుంటూ.. సింగరేణి కుటుంబానికి కిషన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు.