మా మరో ఎంపీ పార్టీ మారబోతున్నారు.. MLA మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు

by GSrikanth |
మా మరో ఎంపీ పార్టీ మారబోతున్నారు.. MLA మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాజకీయాల్లో కొనసాగడంపై మాజీ మంత్రి, మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనకు ఇవే చివరి ఎన్నికలు అని షాకింగ్ కామెంట్స్ చేశారు. మల్కాజ్‌గిరి ఎంపీ టికెట్ నా కుమారుడికి ఇస్తున్నారని మల్లారెడ్డి కుండబద్దలు కొట్టారు. చేవెళ్ల ఎంపీ టికెట్ కోసమే పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరికకు సిద్ధమయ్యారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే ప్రత్యేకంగా సతీమణితో వెళ్లి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారని అన్నారు. ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్‌లోకి వెళ్లకముందే పట్నం మహేందర్ రెడ్డి చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంపై కర్చీఫ్ వేశారని షాకింగ్ కామెంట్స్ చేశారు.

కాగా, ఇటీవలే పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ వెంకటేశ్ నేత సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. అంతేగాకుండా.. వరుసగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తూ గులాబీ శ్రేణులను గందరగోళానికి గుచేస్తున్నారు. ఈ క్రమంలో మరో సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి పార్టీ మారబోతున్నారంటూ మాజీ మంత్రి మల్లారెడ్డి చేసిన పరోక్ష వ్యాఖ్యలు సొంత పార్టీలో కలకలం రేపుతున్నాయి. దీనిపై బీఆర్ఎస్ అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి. మరోవైపు తన కుమారుడిని మల్కాజిగిరి ఎంపీ టికెట్ ఇవ్వబోతుందంటూ మీడియా ముఖంగా చెప్పడం హాట్‌టాపిక్‌గా మారింది. మరి మల్లారెడ్డిపై కేసీఆర్ యాక్షన్ తీసుకుంటారో లేదో వేచి చూడాలి. ప్రస్తుత చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి స్పందనపైనా ఉత్కంఠ నెలకొంది.

Next Story