MP ఎన్నికల్లో CM రేవంత్ దూకుడు.. 50 సభలు, 15 రోడ్ షోలతో షెడ్యూల్ ఫిక్స్!

by Disha Web Desk 4 |
MP ఎన్నికల్లో CM రేవంత్ దూకుడు.. 50 సభలు, 15 రోడ్ షోలతో షెడ్యూల్ ఫిక్స్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీ ఎన్నికల్లో అన్నీ తానై వ్యవహరించి రాష్ట్రమంతా సుడిగాలి పర్యటన చేసిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలను కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ స్వయంగా హైదరాబాద్‌కు వచ్చి మిషన్-15 పేరుతో టాస్క్ అప్పజెప్పడంతో అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని పవర్‌లోకి తీసుకొచ్చినట్టే తెలంగాణ నుంచి మ్యాగ్జిమమ్ కాంగ్రెస్ ఎంపీలను పార్లమెంటుకు పంపాలనుకుంటున్నారు. రాష్ట్రనేతల మధ్య భిన్నాభిప్రాయాలను దృష్టిలో పెట్టుకుని సమిష్టి కృషితో 15 మంది ఎంపీలను గెలిపించుకునేలా కేసీ వేణుగోపాల్ ఇక్కడికొచ్చి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఆ టాస్క్‌లో భాగంగా సీఎం రేవంత్‌ లోక్‌సభ ఎన్నికలు ముగిసేంతవరకూ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించేందుకు ప్లానింగ్ ఖరారైంది.

అభ్యర్థుల నామినేషన్లకు హాజరు

సొంత జిల్లా మహబూబ్‌నగర్ పార్లమెంటు స్థానం నుంచే దీనికి శ్రీకారం చుడుతున్నారు. పాలమూరు ఎంపీ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి నామినేషన్ వేసే కార్యక్రమానికి శుక్రవారం ఉదయం హాజరవుతున్నారు. భారీ స్థాయిలో జరిగే ర్యాలీలో స్వయంగా పాల్గొని స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం మహబూబాబాద్ నియోజకవర్గంలో బలరాం నాయక్ నామినేషన్ దాఖలు కార్యక్రమానికి హాజరవుతారు. ఈ నెల 25న నామినేషన్ల ప్రక్రియ ముగిసేంత వరకూ ఆయన పలు ఎంపీ సెగ్మెంట్లలో నామినేషన్ల కార్యక్రమానికి హాజరయ్యేలా షెడ్యూలు రూపొందింది. ఈ నెల 20న మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్, 21న భువనగిరి అభ్యర్థి చామల కిరణ్ కుమార్‌రెడ్డి, 22న ఆదిలాబాద్ అభ్యర్థి ఆత్రం సుగుణ, 23న నాగర్‌కర్నూల్ అభ్యర్థి మల్లు రవి, 24న జహీరాబాద్ అభ్యర్థి సురేశ్ షేట్కర్ నామినేషన్ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు షెడ్యూలు ఖరారైంది.

ఒక్కో పార్లమెంట్ పరిధిలో 3 భారీ బహిరంగ సభలు..

నామినేషన్ల పర్వం ప్రారంభం కావడంతో వచ్చే నెల 11 వరకు జరిగే ఎలక్షన్ క్యాంపెయిన్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొననున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా హెలికాప్టర్‌ను సమకూర్చుకుంటున్నారు. ఒక్కో పార్లమెంటు స్థానంలో కనీసంగా 3 భారీ బహిరంగసభలను నిర్వహించేలా పార్టీ ఇప్పటికే ప్రోగ్రామ్‌ను రూపొందించింది. మొత్తం 17 నియోజకవర్గాల్లో 50 బహిరంగసభలు, 15 చోట్ల రోడ్ షో లు నిర్వహించేలా పీసీసీ ఆలోచిస్తున్నది. బీజేపీని ప్రధాన ప్రత్యర్థిగా భావించిన కాంగ్రెస్ ఈ ఎన్నికల ప్రచారంలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను, మోడీ పదేండ్ల పాలనలోని ఫెయిల్యూర్స్‌ను ఎండగట్టాలన్నది కాంగ్రెస్ ఆలోచన. బీఆర్ఎస్‌తో పెద్దగా పోటీ లేదని స్వయంగా ఆయన, మంత్రులు వ్యాఖ్యానిస్తుండటంతో ఒకటి రెండు చోట్ల మాత్రమే ఆ పార్టీతో తలపడాల్సి ఉంటుందని భావిస్తున్నారు.

నేషనల్ స్టార్ క్యాంపెయినర్‌గా రేవంత్

తెలంగాణకు మాత్రమే రేవంత్‌రెడ్డిని పరిమితం చేయకుండా ఇతర రాష్ట్రాల్లోనూ ఆయనను క్యాంపెయిన్‌కు వాడుకోవాలని ఏఐసీసీ భావించింది. ఇందులో భాగంగానే ఎలక్షన్ కమిషన్‌కు పంపిన నేషనల్ స్టార్ క్యాంపెయినర్ లిస్టులో రేవంత్‌రెడ్డి పేరును పెట్టింది. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్రతో పాటు బీహార్, గుజరాత్ రాష్ట్రాల పీసీసీలకు కూడా సమాచారాన్ని ఇచ్చింది. రేవంత్‌రెడ్డి హాజరయ్యేలా సభలను ప్లాన్ చేసుకోవాలని సూచించింది. ఇప్పటికే కేరళలో పర్యటించిన రేవంత్‌రెడ్డి..రాహుల్‌గాంధీ పోటీ చేస్తున్న వయనాడ్, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పోటీ చేస్తున్న ఆళప్పుజ సెగ్మెంట్లలో ప్రచారం చేశారు. ఏపీలో ఒక సభకు హాజరైన రేవంత్.. రానున్న రోజుల్లో మరికొన్ని సభలకూ అటెండ్ కానున్నారు. ఈ నెల 20న మెదక్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ నామినేషన్‌లో పాల్గొన్న అనంతరం కర్ణాటకలో ప్రచారానికి వెళ్లనున్నారు.

Next Story

Most Viewed