TG ASSEMBLY: సూచన ముసుగులో మోసం.. అసెంబ్లీలో కేటీఆర్‌పై సీఎం రేవంత్ ఫైర్

by Prasad Jukanti |   ( Updated:2024-07-31 12:10:43.0  )
TG ASSEMBLY: సూచన ముసుగులో మోసం..  అసెంబ్లీలో కేటీఆర్‌పై సీఎం రేవంత్ ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో : కేటీఆర్ 100 శాతం ఆర్టిఫీషియల్, 0 శాతం ఇంటెలిజెన్స్ అని, ఆయన సభను తప్పుదోవ పట్టిస్తూ ముచ్చర్ల దగ్గర భూసేకరణపై రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సూచన ముసుగులో మోసం’ అనే ప్రణాళికను పకడ్బందీగా ప్రజల మెదళ్లలో చొప్పించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ద్రవ్య వినిమయ బిల్లుపై ఇవాళ శాసనసభలో చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. పదేళ్లు ఏలిన మీరు పదినెలలు కూడా పూర్తి చేసుకోని తమ ప్రభుత్వంపై వందల ఆరోపణలు చేస్తున్నారన్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ డెవలప్ అయినట్లుగానే ముచ్చర్లలో ఫోర్త్ సిటీని నిర్మిస్తున్నామని, ఈ ఫోర్త్ సిటీయే రేపటి ఫ్యూచర్ సిటీ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. బతుకమ్మ చీరల విషయంలో డొంకతిరుగుడు మాటలు వద్దని చీరలు సిరిసిల్ల చేనేత కార్మికులు నేసినవా? లేక మీ బినామీలకు కాంట్రాక్టులు ఇచ్చి సూరత్‌ నుంచి కేజీల లెక్క తెచ్చి పంచి పెట్టారా స్పష్టం చేయాలన్నారు. సిరిసిల్ల కార్మికులకు రూ. 275 కోట్ల బతుకమ్మ చీరల బకాయిలు పెడితే తమ ప్రభుత్వం రూ.100 కోట్లు విడుదల చేసిందన్నారు.

రేపు స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన..

ముచ్చర్ల వద్ద భూసేకరణకు సంబంధించి కేటీఆర్ వారికి వారే ఊహించుకొని, వారికి వారే రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని సీఎం ఫైర్ అయ్యారు. తానెప్పుడు మీలా ఓల్డ్‌సిటీని ఇస్తాంబుల్, వరంగల్‌ను లండన్, కరీంనగర్‌ను న్యూయార్క్, ట్యాంక్‌బండ్ నీటిని కొబ్బరి నీళ్లలా చేస్తానని అబద్ధాలు చెప్పలేదని అన్నారు. ముచ్చర్లలో భూసేకరణకు సంబంధించి ఫార్మాసిటీతో పాటు అలాయిడ్ ఇండస్ట్రీస్ కోసం భూసేకరణ చేస్తున్నామని నోటిఫికేషన్‌లో స్పష్టంగా పేర్కొన్నామన్నారు. ముచ్చర్లలో ఫార్మా, అలాయిడ్ ఇండస్ట్రీతోపాటు స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నామని, రేపు సాయంత్రం యూనివర్సిటీకి శంకుస్థాపన చేస్తామన్నారు. హైటెక్ సిటీ వద్ద ఉన్న ఎన్ఏసీని అక్కడికి షిఫ్ట్ చేసి యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. నిఖత్ జరీన్‌కు ఉద్యోగం ఇస్తామని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదని, కానీ తాము మహ్మద్ సిరాజ్‌కు గ్రూప్-1 ఉద్యోగం ఇస్తామని సీఎం తెలిపారు.

కేంద్రం ముందుకు వస్తే తిరస్కరించింది కేసీఆర్ కాదా?:

శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు ఎంఎంటీఎస్ సౌకర్యం కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వం ముందుకు వస్తే వద్దని తిరస్కరించింది కేసీఆర్ కాదా అని రేవంత్ ప్రశ్నించారు. 2.5 కిలోమీటర్ల దూరం భూమి కేటాయిస్తే పేదలకు ఉపయోగపడే ఎంఎంటీఎస్ విమానాశ్రయం వరకు వచ్చేదికదా అని అన్నారు. దీని వెనుక ఉన్న ఆర్థిక కుట్ర తెలంగాణ ప్రజలకు తెలియాలన్నారు. కేసీఆర్ సభకు రాకపోవడంపై స్పందిస్తూ.. సభలో చీల్చి చెండాడుతామంటే ముందస్తు జాగ్రత్తగా బుల్లెట్ ఫ్రూమ్ జాకెట్ కూడా తీసుకొచ్చామని సెటైర్ వేశారు.

Advertisement

Next Story

Most Viewed