సిటీ బస్సులో ప్రసవం.. మహిళా కండక్టర్ మానవత్వం.. సజ్జనార్ స్పందన

by Ramesh N |
సిటీ బస్సులో ప్రసవం.. మహిళా కండక్టర్ మానవత్వం.. సజ్జనార్ స్పందన
X

దిశ, డైనమిక్ బ్యూరో: టీజీఎస్ ఆర్టీసీ బస్సులో పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణికి ఆర్టీసీ కండక్టర్ పురుడు పోసి మానవత్వం చాటుకున్నారు. ఈ ఘటనపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేస్తూ.. వివరాలు వెల్లడించారు. హైదరాబాద్ ముషీరాబాద్ డిపోకు చెందిన 1 జెడ్ రూట్ బస్సులో శుక్రవారం ఉదయం శ్వేతా రత్నం అనే గర్భిణీ ఆరాంఘర్ లో ఎక్కారు. బహదూర్‌పుర వద్దకు రాగానే ఆమెకు పురిటి నొప్పులు తీవ్రమయ్యాయి.

ఈ విషయాన్ని గమనించిన కండక్టర్ ఆర్.సరోజ అప్రమత్తమై మహిళా ప్రయాణికుల సాయంతో సాధారణ ప్రసవం చేశారు. ఆమె పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం సమీపంలోని గవర్నమెంట్ మెటర్నిటీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారని సజ్జనార్ పేర్కొన్నారు. బస్సులోనే కాన్పు చేసి మానవత్వం చాటుకున్న కండక్టర్ సరోజతో పాటు సహా మహిళా ప్రయాణికులను ఈ సందర్భంగా ఎండీ వీసీ సజ్జనార్ అభినందనలు తెలియజేశారు. అప్రమత్తమై సకాలంలో స్పందించడం వల్లే తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చడంతో పాటు సేవా స్ఫూర్తిని ఆర్టీసీ సిబ్బంది చాటుతుండటం ప్రశంసనీయమన్నారు.

ఈ విషయం తెలుసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ లేడీ కండక్టర్, మహిళ ప్రయాణికులకు అభినందనలు తెలుపుతూ.. ట్వీట్ చేశారు. సమయస్పూర్తితో వ్యవహరించడం వల్లే తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారని, వారికి సరైన వైద్యం అందించాలని సూచించినట్లు వెల్లడించారు. కాగా, ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సరి లేరు మీకెవ్వరు.. అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. గ్రేట్.. విధి నిర్వహణలోనూ మానవతను చాటుకున్న మహిళా కండక్టర్ తల్లికి వందనం అంటూ మరో నెటిజన్ కామెంట్ పెట్టాడు.

Advertisement

Next Story

Most Viewed