లాఠీచార్జ్ దారుణం.. బాధ్యులైన పోలీసులను సస్పెండ్ చేయాలి.. రాజాసింగ్ ఫైర్

by Ramesh Goud |   ( Updated:2024-10-19 12:56:36.0  )
లాఠీచార్జ్ దారుణం.. బాధ్యులైన పోలీసులను సస్పెండ్ చేయాలి.. రాజాసింగ్ ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: శాంతియుతంగా నిరసన తెలుపుతున్న భక్తులపై లాఠీచార్జ్ చేయడం దారుణమని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం వద్ద జరిగిన లాఠీచార్జ్ పై ట్విట్టర్ వేదికగా వీడియో విడుదల చేసిన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా రాజాసింగ్ మాట్లాడుతూ.. సికింద్రాబాద్‌లోని పవిత్రమైన మఠం ముత్యాల్లమ్మ ఆలయం వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న హిందూ సోదరులపై క్రూరమైన, అన్యాయమైన లాఠీచార్జిని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. తాను శుక్రవారం రెండవ జాకీర్ నాయక్ కావాలనుకుంటున్న మునావర్ జామాను అరెస్ట్ చేయలేదని ప్రశ్నించానని తెలిపారు.

ఈ సందర్భంగా హిందు సంఘాలు సికింద్రాబాద్ ప్రాంగణంలో బంద్ కు పిలుపునిచ్చాయని, దానికి చాలామంది ప్రజలు మద్దతు తెలిపారని, స్థానిక ప్రజలు షాపులు కూడా బంద్ చేశారని అన్నారు. ఇందులో భాగంగా ఆలయం వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న హిందు సంఘాల కార్యకర్తలపై పోలీసులు జులూం ప్రదర్శించారని మండిపడ్డారు. దారుణంగా లాఠీచార్జ్ చేసి వారిని తీవ్రంగా గాయపరిచారని ఫైర్ అయ్యారు. అసలు పోలీసులకు లాఠీచార్జ్ చేసే అధికారం ఎవరు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లాఠీచార్జ్ కు బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని, కార్యకర్తలను గాయాలపాలు చేసిన పోలీసులను గుర్తించి సస్పెండ్ చేయాలని కేంద్రమంత్రులు అమిత్ షా, బండి సంజయ్ లను రాజాసింగ్ కోరారు.

Advertisement

Next Story

Most Viewed