కేంద్ర బ‌డ్జెట్ అద్భుతం: బీజేఎల్పీనేత ప్రశంసలు

by srinivas |
కేంద్ర బ‌డ్జెట్ అద్భుతం: బీజేఎల్పీనేత ప్రశంసలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర బ‌డ్జెట్ సామాన్యుల క‌ల‌ల‌ను సాకారం చేసే అద్భుత బ‌డ్జెట్ అని, పేద‌లు, యువ‌త‌, రైతులు, మ‌హిళ‌లకు ప్రాధాన్యత ఇచ్చినట్లు బీజేఎల్పీనేత మహేశ్వర్​రెడ్డి పేర్కొన్నారు. శనివారం కేంద్ర బడ్జెట్​పై స్పందిస్తూ దేశాన్ని ప్రగతి ప‌ధంలో ప‌రుగులు పెట్టించి, ప్రపంచ దేశాల్లో భార‌త్ ను అగ్రగామిగా నిల‌బెట్టే బ‌డ్జెట్ గా ఉందన్నారు. దేశంలో వ్యవ‌సాయ రంగాన్ని ఆర్ధికంగా మ‌రింత ప‌రిపుష్టం, సూక్ష్మ, చిన్న, మ‌ధ్య త‌ర‌హా ప‌రిశ్రమ‌ల ఏర్పాటు ద్వారా నిరుద్యోగ స‌మ‌స్యను త‌గ్గిస్తుందన్నారు. ఇటు సంక్షేమానికి, అటు అభివృద్ధికి స‌మాన ప్రాధాన్యత ఇస్తూ కేంద్రం స‌మ‌తుల బ‌డ్జెట్‌ను రూపొందించిందని హర్షం వ్యక్తం చేశారు. బ‌డ్జెట్‌లో లోపాల‌ను వెతికే వారంతా దేశాభివృద్ధికి వ్యతిరేకులేని మండిపడ్డారు.

మధ్యతరగతి ప్రజలకు ఆదాయ పన్ను పరిమితి రూ. 12 లక్షల వరకు పెంచడం గొప్ప విషయమన్నారు. దేశీయంగా తయారీ పరిశ్రమలకు మద్దతు స్టార్టప్‌లను ప్రోత్సహించడమే లక్ష్యంగా క్రెడిట్ గ్యారంటీ రూ.ఐదు కోట్ల నుంచి రూ.10 కోట్లకు పెంపు సాధారణ విషయం కాదన్నారు. ఐదు లక్షల మంది ఎస్సీ, ఎస్టీ మహిళలకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కింద రూ.2కోట్ల రుణాలు ఇవ్వడం, ఆరోగ్య రంగంలో కీలక నిర్ణయాలు తీసుకుందన్నారు. వ్యవసాయ రంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చి భ‌విష్యత్తు ఆహార భ‌ద్రత కోసం రెండో జ‌న్యు బ్యాంకు ఏర్పాటు, వంద జిల్లాలను ఎంపిక చేసి వ్యవసాయంలో అధునూతన పద్ధతులను తీసుకరావడం చరిత్రలో మరిచిపోలేదన్నారు. దేశంలో వెన‌క‌బ‌డిన జిల్లాల్లో వ్యవసాయానికి ప్రోత్సాహం గోడౌన్లు, ఇరిగేష‌న్, రుణ సౌక‌ర్యాల క‌ల్పన వంటి నిర్ణయాలు గొప్పమన్నారు.


Next Story