‘బీజేపీ రైతు హామీల సాధన దీక్ష’కు రైతులంతా తరలిరావాలి : బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి

by M.Rajitha |
‘బీజేపీ రైతు హామీల సాధన దీక్ష’కు రైతులంతా తరలిరావాలి : బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ మెడలు వంచేందుకే బీజేపీ రైతు దీక్ష చేపడుతోందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శలు చేశారు. ఈనెల 30న ‘బీజేపీ రైతు హామీల సాధన దీక్ష’ పేరిట ఇందిరాపార్క్ వద్ద బీజేఎల్పీ ఆధ్వర్యంలో చేపడుతున్న దీక్షా స్థలాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతులకు ఎన్నో అమలుకాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ మభ్యపెట్టిందని మండిపడ్డారు. వరంగల్ డిక్లరేషన్ పేరుతో రైతులను మోసం చేశారని ధ్వజమెత్తారు. రుణమాఫీ సగం మంది రైతులకు కూడా అవ్వలేదన్నారు. బోనస్, రైతు భరోసా వంటి జాడే లేదని ఏలేటి చురకలంటించారు. అందుకే రైతులకు మద్దతుగా 24 గంటల పాటు దీక్ష చేపట్టబోతున్నట్లు చెప్పారు. రైతులంతా ఈనెల 30న చేపట్టనున్న దీక్షకు మద్దతుగా తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.

అనంతరం ఏలేటి మహేశ్వర్ రెడ్డి.., మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తో కలిసి మూసీ పరివాహక ప్రాంతంలో హైడ్రా ఇండ్లు కూల్చివేసిన భాదితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఏలేటి మాట్లాడుతూ.. హైడ్రా పేరుతో సర్కార్ హైడ్రామా ఆడుతోందని మండిపడ్డారు. పేదల ఇండ్లను, గుడిసెలను కూల్చుతున్న సర్కార్ కు.. పెద్దల ఇండ్లు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ప్రజలకిచ్చిన హామీల నుంచి డైవర్ట్ చేయడానికే సర్కార్ జిమ్మిక్కులు చేస్తోందని చురకలంటించారు. మూసీ ఒడ్డున ఎఫ్‌టీఎల్ అని తెలియక చాలామంది నిరుపేదలు ఇక్కడ కొనుకున్నారని, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అధికారులు కూల్చడానికి వస్తున్నారని ఏలేటి ఆవేదన వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి బీదల సాదక బాధకాలు తెలుసుకోకుండా అమెరికా పర్యటనలు చేస్తూ టైంపాస్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ లో బడా బాబులకు నోటీసులు ఇచ్చారని, వారు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంటున్నారని, మరి పేదవారికి నోటీసులు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. పేదల ఇండ్లను కూలుస్తున్న ముఖ్యమంత్రి.. తన అన్న ఇంటిని ఎందుకు కూల్చడంలేదని ఏలేటి ప్రశ్నించారు. బీఆర్ఎస్ కాళేశ్వరం పేరిట దోచుకుంటే, కాంగ్రెస్ మూసీ ప్రక్షాళన పేరిట దోచుకుంటోందని ఆరోపించారు. ఉద్యోగుల జీతాలకు, ఆరు హామీలు అమలుచేయడానికి డబ్బులు సర్కార్ వద్ద లేవని, కానీ మూసీ ప్రక్షాళనకు డబ్బులు ఎక్కడివి అని ఆయన ప్రశ్నించారు. పాతబస్తీ నాయకులు కబ్జా చేసి కట్టిన వాటిని ఎందుకు కూల్చడం లేదని మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా కూల్చివేతలను ఆపకపోతే బీజేపీ ఎమ్మెల్యేలమంతా కలిసి ఆందోళనలు ఉధృతం చేస్తామని ఏలేటి హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed