విజిలెన్స్ నివేదిక ఆధారంగా వారిపై చర్యలు.. మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు

by Ramesh Goud |
విజిలెన్స్ నివేదిక ఆధారంగా వారిపై చర్యలు.. మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో పత్తి కొనుగోళ్ల సమయంలో పలు చోట్ల జరిగిన అవకతవకలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పలు వార్త కథనాలపై శుక్రవారం స్పందించిన ఆయన అవకతవకలపై వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ మార్కెట్లలో విజిలెన్స్ విచారణ చేపడుతున్నారని, నివేదిక ఆధారంగా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా, విజిలెన్స్ విచారణను వేగంగా పూర్తి చేసి, రిపోర్టును సమర్పించే విధంగా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ కార్యదర్శి, మార్కెటింగ్ డైరెక్టర్ కి ఆదేశాలిచ్చారు. అదేవిధంగా రాష్ట్రంలోని ప్రతి మార్కెటింగ్ సెక్రటరీ, జిల్లా మార్కెటింగ్ అధికారుల నుండి వివరణ తెప్పించుకోవాలని మార్కెటింగ్ డైరెక్టర్ కు సూచించారు. మార్కెట్లలో జరిగే ఎలాంటి అక్రమాలను ప్రభుత్వం ఉపేక్షించదని, రైతులకు నష్టం కలిగే విధంగా ఎవరూ నడుచుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

162 మార్కెట్ కమిటీలకు నూతన కార్యవర్గం..

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 197 మార్కెట్ కమిటీల్లో ఇప్పటివరకు 162 కమిటీలకు నూతన పాలకవర్గాలను నియమించడం జరిగిందని వ్యవసాయశాఖ మంత్రి తెలిపారు. సంవత్సరంలోనే 2,268 నామినేట్ పోస్టులను భర్తీ చేశామని, రాష్ట్రం ఏర్పడిన తర్వాత అతి తక్కువ సమయంలో ఈ స్థాయిలో మార్కెట్ కమిటీలను ఏర్పాటు చేసిందే ఇదే మొదటిసారని తెలిపారు. మార్కెట్లలో జరిగే అవకతవకలకు అడ్డుకట్ట పడేవిధంగా, రైతులకు గరిష్ట మద్ధతు ధర వచ్చే విధంగా రైతులకు కావాల్సిన కనీస వసతులు కల్పించే దిశగా ఈ పాలకవర్గాలు పనిచేయాలని సూచించారు.

గత ప్రభుత్వ హయాంలో మార్కెట్ కమిటీలకు పాలకవర్గాలు లేని పరిస్థితుల వలన రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ప్రస్తుతం ప్రజా ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని, వేగంగా కమిటీలను ఏర్పాటు చేస్తోందని తెలిపారు. మిగిలిన మార్కెట్ కమిటీలకు కూడా త్వరలోనే పాలకవర్గాలు నియమించబడతాయని పేర్కొన్నారు. ఈ విషయం సీఎం రేవంత్​రెడ్డి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, మిగతా మార్కెట్ కమిటీలతో పాటు ఏటిఎంఏ , ఇతర నామినేటెడ్ పోస్టులను త్వరలోనే భర్తీ చేయడం జరుగుతుందని తెలిపారు.



Next Story

Most Viewed