ఐసీఎంఆర్ నిబంధనలకు తెలంగాణ తూట్లు

by  |
ఐసీఎంఆర్ నిబంధనలకు తెలంగాణ తూట్లు
X

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా కట్టడిలో తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఎన్ని విమర్శలు వచ్చినా ‘ఐసీఎంఆర్ గైడ్‌లైన్స్ ప్రకారమే వ్యవహరిస్తున్నాం’ అంటూ వైద్యారోగ్య మంత్రి ఈటల రాజేందర్ మొదలు ఆసుపత్రుల సూపరింటెండెంట్ల వరకు పదేపదే చెప్పే మాట. కానీ ఆచరణలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఇందుకు నిదర్శనమే తాజాగా భువనగిరి జిల్లా వైద్యాధికారి జారీ చేసిన సర్క్యులర్. కొవిడ్ నిర్ధారణ కోసం పేషంట్ల నుంచి తీసుకునే స్వాబ్ (ముక్కు, గొంతులోంచి తీసుకునేవి) శాంపిళ్ళను ఈఎన్‌టీ నిపుణులు లేదా ఆ విభాగంలో పోస్టు గ్ర్యాడ్యుయేషన్ కోర్సు చేస్తున్న శిక్షణ పొందిన డాక్టర్లు మాత్రమే తీసుకోవాలని ఐసీఎంఆర్ ఏప్రిల్ నెలలోనే స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. కానీ తెలంగాణ ప్రభుత్వం దాన్ని ఆచరణలో పెట్టలేదు. పైగా నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు ఈ నమూనాలను సేకరించాలని జిల్లా వైద్యాధికారులు కింది స్థాయిలోని ఆ శాఖ అధికారులకు సర్క్యులర్ ద్వారా స్పష్టం చేశారు.

అన్నీ ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారమే నడుచుకుంటున్నామని చెప్పుకునే ప్రభుత్వం ఇప్పుడు దీనికి సమాధానం చెప్పాల్సి ఉంది. రాష్ట్రంలో ర్యాపిడ్ పరీక్షలను 320 టెస్టింగ్ కేంద్రాల్లో నిర్వహిస్తున్నామని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ చెప్తున్నా ఆ శాంపిళ్ళను తీసుకోడానికి మాత్రం ఈఎన్‌టీ డాక్టర్లను వినియోగించడంలేదు. చాలా టెస్టింగ్ కేంద్రాల్లో ల్యాబ్ టెక్నీషియన్ల ద్వారానే ఈ ప్రక్రియ జరుగుతోంది. ల్యాబ్ టెక్నీషియన్లకు పరీక్ష చేసి రిపోర్టు ఇవ్వడమే తప్ప స్వాబ్ శాంపిల్‌ను తీసుకోవడం తెలియదు. స్వాబ్ శాంపిల్‌ను తీసుకోడానికి ప్రత్యేకంగా శిక్షణ అవసరం. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగినంత సంఖ్యలో ఇఎన్‌టీ డాక్టర్లు లేకపోవడంతో వైద్య విధాన పరిషత్ ద్వారా మామూలు డాక్టర్లకు శిక్షణ ఇప్పించింది. తెలంగాణలో మాత్రం నర్సులు కూడా ఇకపైన స్వాబ్ శాంపిళ్ళను తీసుకోవాల్సి ఉంటుందని, లేకపోతే వారిపై కఠిన చర్యలు తీసుకోక తప్పదని భువనగిరి జిల్లా వైద్యాధికారి ఒక సర్క్యులర్ ద్వారా స్పష్టం చేశారు.

నర్సులే ర్యాపిడ్ టెస్టులు చేయాలి

ర్యాపిడ్ టెస్టుల ద్వారా కరోనా నిర్ధారణ చేయడానికి పేషెంట్ల నుంచి తీసుకునే స్వాబ్ శాంపిల్స్ బాధ్యత ల్యాబ్ టెక్నీషియన్లదేనని, వారు లేనిచోట నర్సుల ద్వారా ఆ పని చేయించాలని భువనగిరి జిల్లా వైద్యాధికారి ఇచ్చిన సర్క్యులర్ నర్సుల్లో కలకలం రేపుతోంది. జిల్లాలోని వైద్యాధికారులందరూ దీన్ని పాటించాలని ఆ సర్క్యులర్‌లో ఆదేశించారు. సిద్ధంకాని నర్సులపై చర్యలు తప్పవని కూడా హెచ్చరించారు. ఇందుకోసం శాంపిళ్ళు తీసుకోవడంపై నర్సులకు బీబీనగర్‌లోని ఎయిమ్స్‌లో శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కార్యదర్శి, ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ ఆదేశాల మేరకు ఈ సర్క్యులర్ జారీ చేయాల్సి వచ్చిందని, అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్సులో ఈ విషయాన్ని చెప్పినట్లు ఆ సర్క్యులర్‌లో ప్రస్తావించారు.

ఈఎన్‌టీ డాక్టర్లు లేదా ఆ విభాగంలోని పోస్టు గ్రాడ్యుయేట్ డాక్టర్లు స్వాబ్ శాంపిళ్ళను తీసుకోవాలని ఐసీఎంఆర్ మార్గదర్శకాలు జారీ చేసినా వాటిని మాత్రం తెలంగాణ ప్రభుత్వం అమలుచేయడంలేదు. దానికి నిలువెత్తు నిదర్శనమే భువనగిరి జిల్లా వైద్యాధికారి జారీ చేసిన సర్క్యులర్. పైగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కార్యదర్శి, రాష్ట్ర ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ జిల్లా కలెక్టర్ల టెలీ కాన్ఫరెన్సులో స్పష్టం చేశారని గుర్తుచేశారు. ఈ సర్క్యులర్ ప్రకారమే చూస్తే రాష్ట్ర కార్యదర్శి మొదలు జిల్లా వైద్యాధికారి వరకు ఐసీఎంఆర్ మార్గదర్శకాలను పాటించడంలేదని స్పష్టమవుతోంది. ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారమే నడుచుకుంటున్నామని, తు.చ తప్పకుండా పాటిస్తున్నామని హైకోర్టుకు మూడు రోజుల క్రితం ప్రధాన కార్యదర్శి స్వయంగా చెప్పినా ఇప్పుడు ఈ సర్క్యులర్ దానికి భిన్నంగా ఉన్నట్లు అర్థమవుతోంది. ప్రభుత్వం చెప్పేదొకటి… చేసేది మరొకటిగా ఉందని ఈ సర్క్యులర్ స్పష్టం చేస్తోంది.


Next Story