ఇదేనా మా బాబాయి చేసిన తప్పు?: రామ్మోహన్ నాయుడు

by  |
ఇదేనా మా బాబాయి చేసిన తప్పు?: రామ్మోహన్ నాయుడు
X

దిశ, ఏపీ బ్యూరో: ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌లో బాధ్య‌తాయుత‌మైన ప్ర‌తిప‌క్ష పాత్ర పోషించ‌డమే మా బాబాయ్ చేసిన త‌ప్పా? అంటూ టీడీపీ నేత, ఎంపీ రామ్మోహన్ నాయుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు. తొలుత ట్విట్టర్ మాధ్యమంగా స్పందించిన ఆయన, ‘అసెంబ్లీలో అధికార‌ప‌క్షాన్ని నిల‌దీసే నిలువెత్తు ప్ర‌జల ధైర్యం మా బాబాయ్ అచ్చెన్నాయుడు. ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌లో బాధ్య‌తాయుత‌మైన ప్ర‌తిప‌క్ష పాత్ర పోషించ‌డమే మా బాబాయ్ చేసిన త‌ప్పా? అణ‌చివేత‌కు గురైన బీసీ వ‌ర్గాల గొంతుక‌గా త‌న గ‌ళాన్ని వినిపిస్తున్న అచ్చెన్న‌ని స‌భ‌లో ఎదుర్కొనే స‌త్తా మీ 151 ఎమ్మెల్యేల‌కూ లేదా? టీడీఎల్పీ ఉప‌నేత, ఎమ్మెల్యే, మాజీ మంత్రిని అరెస్టు చేసేట‌ప్పుడు క‌నీస చ‌ట్ట‌బ‌ద్ధంగా వ్య‌హ‌రించ‌డ‌మైనా చేత‌కాదా? బీసీ నేత‌ల‌కిచ్చే గౌర‌వం ఇదేనా? అస‌లు అచ్చెన్నాయుడిని అరెస్టు చేసింది ఏసీబీనా? ‌లేదంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గూండాలా?’ అంటూ ప్రశ్నించారు.

అనంతరం శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తన బాబాయి అచ్చెన్నాయుడు అరెస్టుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని ఎవరూ ప్రశ్నించకూడదా? అని నిలదీశారు. ప్రతి రాష్ట్రం కంటే తక్కువ ధరతో ఏపీలో గతంలో మందులు కొనుగోలు చేశామని అన్నారు. అయినా కుంభకోణం జరిగిందని ఆరోపించినప్పుడు సెక్షన్ ఆఫీసర్ నుంచి ఒక్కొక్కరిని విచారిస్తూ చర్యలు తీసుకోవాలి కానీ, ఇలాంటి కక్షపూరిత చర్యలకు పాల్పడడమేంటని ప్రశ్నించారు. 2019 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్లో వైఎస్సార్సీపీ నేతలు ఒక్కటైనా అమలు చేశారా? అని ప్రశ్నించారు. నవరత్నాలు అంటూ ప్రజలకు ఇష్టమొచ్చినట్లు హామీలు ఇచ్చారని, వాటని అమలు చేయకపోవడమే కాకుండా ప్రజా సంక్షేమం కోసం చంద్రబాబు నాయుడు గతంలో ప్రవేశపెట్టిన ఎన్నో కార్యక్రమాలను రద్దు చేశారని మండిపడ్డారు. ప్రజల మద్దతున్న నాయకుడిపై కక్ష సాధిస్తున్నారని చెప్పారు. బీసీలకు ఇచ్చే గౌరవం ఇదేనా అని నిలదీశారు.


Next Story

Most Viewed