ఆ ఇద్దరిపై చంద్రబాబు ఆగ్రహం..

by  |
ఆ ఇద్దరిపై చంద్రబాబు ఆగ్రహం..
X

దిశ, వెబ్‌డెస్క్ :

ఏపీలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. శుక్రవారం రాత్రి శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో సమన్వయ సమావేశం నిర్వహించిన బాబు.. పలు కీలక విషయాలపై వారితో చర్చించారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై తెలుగు తమ్ముళ్లు అధినేతకు పలు ఫిర్యాదులు చేయగా.. సీఎం జగన్, మంత్రి కొడాలి నానిపై మండిపడ్డారు. ఈ క్రమంలోనే ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి, బెందాళం అశోక్ తండ్రి ప్రకాష్ మృతికి సంతాపంగా రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు.

జగన్‌వి కక్ష సాధింపు చర్యలు..

ప్రతిపక్షాలపై సీఎం జగన్ కావాలనే కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నాడని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజలపై వేధింపులకు పాల్పడిన ప్రభుత్వాన్ని ఇప్పుడే చూస్తున్నామని, అన్ని వ్యవస్థలను జగన్మోహన్ రెడ్డి నిర్వీర్యం చేస్తున్నారన్నారు. మంత్రులు బరితెగించి వ్యవహరిస్తున్నారని.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లీం మైనార్టీ వర్గాల ప్రజలు వైసీపీ వేధింపులతో అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. దళితులపై దాడులు, హత్యలు, అత్యాచారాలు, శిరోముండనాలు గతంలో చూడలేదన్నారు. సింహాచలం ఆలయంతో ప్రారంభించి.. నేడు తిరుమల టెంపుల్ పై దాడులు చేసేవరకు వచ్చారన్నారు.

మాస్క్ లేదని కొట్టి చంపుతారా..

కరోనాతో రాష్ట్రం అతలాకుతలం అవుతుంటే.. సీఎం ఏనాడూ మాస్కు వేసుకున్న దాఖలాల్లేవు. కానీ.. మాస్కు లేదన్న కారణంతో చీరాలలో ఓ యువకుడిని కొట్టి చంపేశారు. చివరికి బంధువులను బెదిరించి కేసు లేకుండా చేయాలనుకుంటే కోర్టు వారి ప్రయత్నాలను తిప్పికొట్టింది.ఇళ్ల స్థలాల పేరుతో రూ.4వేల కోట్ల అక్రమాలకు పాల్పడ్డారు. జగన్ రెడ్డి వ్యవసాయ బోర్లకు మీటర్లు అంటున్నారు. కానీ.. ప్రజలు నమ్మేదెలా? గతంలో నీవిచ్చిన హామీలపై ఎలా మాట తప్పావో ప్రజలంతా చూశారు. ఇప్పుడు రైతులపై కూడా అలాగే తప్పితే వారి పరిస్థితి ఏమిటి.?. ప్రతి రైతు ఈ విధానాన్ని వ్యతిరేకించాల్సిందే.

మంత్రి కొడాలి నాని..

మంత్రి కొడాలి నానిని ఉద్దేశించి చంద్రబాబు పరోక్షంగా విమర్శించారు. ‘రోడ్లపై కూడా మాట్లాడుకోలేని విధమైన బూతులు మాట్లాడుతున్నారు. రథాలు కాలిపోతే కొత్తవి తయారుచేయిస్తాం.. వెండి సింహం బొమ్మలు పోతే కొత్తవి కొంటాం. ఆంజనేయస్వామి బొమ్మ చేయి నరికితే ఆంజనేయస్వామికి వచ్చిన నష్టం లేదని మాట్లాడటం బాధాకరం. దీనంతటి వెనుక చీకటి అజెండా ఒకటి ఉందని అందరూ గుర్తించాలని బాబు కోరారు. ఇలాంటి దాడుల ద్వారా మత మార్పిడులు పెంచి ఓటు బ్యాంకును పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నారు’ అని చంద్రబాబు మండిపడ్డారు.



Next Story

Most Viewed