రాళ్లలో రత్నాలు.. ఒక్క రోజులో ధనవంతుడు!

by  |
రాళ్లలో రత్నాలు.. ఒక్క రోజులో ధనవంతుడు!
X

అనుకోకుండా వచ్చే అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు, అది వచ్చాక ఇక ఆగాల్సిన అవసరం ఉండదు. టాంజానియాకు చెందిన ఒక మైనింగ్ క్వారీ యజమానికి కూడా సరిగ్గా ఇలాగే జరిగింది. తన మైనింగ్ ప్రదేశం వద్ద రెండు పెద్ద టాంజనైట్ జెమ్‌స్టోన్స్ దొరకడంతో ఒక్కరోజులోనే ధనవంతుడిగా మారిపోయాడు. కానీ ఆయన ఈ డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేయాలనే స్వార్థం చూసుకోలేదు. తన డబ్బుతో స్థానిక కమ్యూనిటీ కోసం స్కూల్, షాపులు కట్టిస్తానని అంటున్నాడు. మన్యారాలోని సిమంజిరో జిల్లాకు చెందిన సనిన్యూ లైజెర్‌కు ఉత్తర టాంజానియాలో మైనింగ్ గని ఉంది. అందులో 30 సెం.మీ. పొడవు, 10 సెం.మీ. వెడల్పు గల రెండు ముదురు ఉదా రంగు జెమ్‌స్టోన్స్ దొరికాయి.

ఆ రంగు రాళ్ల విలువ దాదాపు 3.35 మిలియన్ డాలర్లు ఉంటుంది. ఇవి దొరికిన సంతోషంలో గ్రామం మొత్తానికి పార్టీ ఇస్తానని లైజెర్ ప్రకటించాడు. అంతేకాకుండా తన ఇంటికి దగ్గరలో ఒక స్కూల్ నిర్మించి, తమ పిల్లలను పాఠశాలలకు పంపలేని వారికి సాయం చేయాలని అనుకుంటున్నట్లు లైజెర్ తెలిపాడు. అలాగే దుకాణాలు కూడా నిర్మిస్తానని, తద్వారా వ్యాపారస్తులు లాభపడొచ్చని చెప్పాడు. దాదాపు 200 మంది అతని గనిలో పనిచేస్తుంటారు. అయితే గని కార్మికులు ఈ రాళ్లను కనిపెట్టినపుడు లైజెర్ అక్కడ లేడు. తర్వాత విషయం తెలుసుకుని వెంటనే వచ్చినట్లు కార్మికులు చెప్పారు. వరుసగా 9.27 కేజీ, 5.103 కేజీల బరువు ఉన్న ఈ రాళ్లు గతవారమే గనిలో దొరికాయి. కానీ లైజెర్ వాటిని ప్రభుత్వానికి అమ్మాలని నిర్ణయించుకున్న తర్వాతనే విషయం బయటపడింది. అమ్మిన తర్వాత వచ్చిన డబ్బులో పది శాతం కార్మికులను పంచుతానని లైజెర్ హామీ ఇచ్చి తన దాతృత్వం చాటుకున్నారు.


Next Story

Most Viewed