కరీంనగర్‌‌కు మణిహారంగా తీగల వంతెన

by  |
కరీంనగర్‌‌కు మణిహారంగా తీగల వంతెన
X

దిశ ప్రతినిధి, కరీంనగర్:
ఉత్తర తెలంగాణకు కేంద్ర బిందువుగా ఉన్న కరీంనగర్ సిగలో మరో కలికితురాయి వచ్చి చేరుతోంది. అత్యంత అరుదైన వంతెన నిర్మాణంతో నగరంలో సరికొత్త శోభ సంతరించుకోబోతోంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఇంతవరకు లేనటువంటి ఈ వంతెన నిర్మాణం జరుగుతుండడంతో టూరిజం, రవాణా కూడా మెరుగుపడనుంది. ఆరో ద్వారంగా రూపుదిద్దుకుంటున్న తీగల వంతెన దసరా కల్లా పూర్తి కాబోతోంది. రూ. 183 కోట్లతో నిర్మిస్తున్న ఈ సస్పెన్షన్ బ్రిడ్జి దేశంలో ఇప్పటి వరకు హౌరా, ముంబాయిలో మాత్రమే ఉన్నాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ మహానగరంలోని దుర్గం చెరువు, కరీంనగర్‌లోని మానేరు నదిపై నిర్మిస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో కరీంనగర్ కేబుల్ బ్రిడ్జి అతి పెద్దది కావడం విశేషం. ఆధునిక సాంకేతికతను ఉపయోగించి నిర్మిస్తున్న ఈ వంతెనకు డైనమిక్ లైటింగ్ సిస్టం కూడా ఏర్పాటు చేయబోతున్నారు. రానున్న కాలంలో మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు పూర్తయితే ఈ బ్రిడ్జికి దిగువన అన్ని వేళల్లో నీరు నిలిచి ఉండడంతో పర్యాటక శోభ కూడా సంతరించుకోనుంది. దీంతో టూరిజం పరంగా నగరానికి వచ్చే పర్యాటకులకు మరింత ఆహ్లాదాన్ని పంచిపెట్టనుంది. అంతేకాకుండా వరంగల్ తో పాటు దక్షిణాది రాష్ట్రాలకు రాకపోకలకు మార్గం మరింత సుగమం కానుంది. దసరా నాటికల్ల ఈ వంతెన నిర్మాణం పూర్తి చేసి రాకపోకలను ప్రారంభించేందుకు అధికార యంత్రాంగం కసరత్తులు చేస్తోంది.

అవాంతరాలు అధిగమించాం..

ఈ వంతెన నిర్మాణానికి అడ్డుగా ఉన్న అన్ని అవాంతరాలను అధిగమించాం. సాంకేతితను అందిపుచ్చుకుని నిర్మిస్తున్న ఈ కేబుల్ బ్రిడ్జి కరీంనగర్ జిల్లాకే తలమానికంగా కాబోతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్ పై ఉన్న అనుభందం వల్లే నిధులు మంజూరు చేశారు. పర్యాటకంగా నగరాన్ని అభివృద్ది చేస్తే స్థానికంగా కూడా ఉపాధి దొరుకుతుంది.
-గంగుల కమలాకర్, మంత్రి


Next Story