వికారాబాద్‌లో అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

by  |
వికారాబాద్‌లో అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: వికారాబాద్ మండల పరిధిలో గల మైలార్ దేవరంపల్లి గ్రామానికి చెందిన సంగన్నగారి వెంకట్ రెడ్డి కుమారుడు ఈశ్వర్ రెడ్డి (70) అనే రైతు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య వెంకటమ్మ, ఇద్దరు కూతుళ్ళు ఇందిరమ్మ, గాలమ్మలు ఉన్నారు. ఇద్దరు కూతుళ్ళ వివాహాలు అయ్యాయి. పెద్ద కూతురు ఇందిరమ్మను వారసురాలిగా పెట్టుకొని, ఇల్లరికంగా రాంచంద్రారెడ్డిని తెచ్చుకున్నాడు. ఇందిరమ్మకు ఒక కుమారుడు, ఒక కూతురు ఉన్నారు. మృతుడు ఈశ్వర్ రెడ్డి ఐసిఐసిఐ బ్యాంక్ లో సుమారు 4.5 లక్షల రూపాయలు అప్పు తెచ్చుకున్నాడు. అప్పుల వత్తిళ్ళు ఎక్కువ కావడంతో తీర్చే మార్గం కనిపించకపోవడంతో మనోవేదన చెందేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు. శనివారం తెల్లవారు జామున సుమారు 3 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బయటికి వెళ్ళాడు. తాత ఈశ్వర్ రెడ్డి కనిపించడం లేదని మనవడు పాండు రంగారెడ్డితో పాటు కుటుంబ సభ్యుల చుట్టుపక్కల ప్రాంతాలను వెతికారు. పొలానికి వెళ్లాడేమోనని అనుమానంతో వెళ్లి చూడగా మేడి చెట్టుకు ఉరి వేసుకున్న దృశ్యాన్ని చూశాడు. తాత ఈశ్వర్ రెడ్డి చనిపోయాడని కుటుంబ సభ్యులకు, గ్రామ సర్పంచ్ ఆలంపల్లి తిరుపతి రెడ్డికి సమాచారం అందజేశాడు. గ్రామ సర్పంచ్ వెంటనే పోలీసులకు సమాచారం తెలిపాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని చెట్టు నుంచి కిందికు దించి పంచనామా నిర్వహించారు. అనంతరం పోస్ట్ మార్టం నిమిత్తం వికారాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోస్ట్ మార్టం నిర్వహించిన అనంతరం శవాన్ని బంధువులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


Next Story