ఆ క్లాసులు అర్థం కాక.. విద్యార్థి ఆత్మహత్య

by  |
ఆ క్లాసులు అర్థం కాక.. విద్యార్థి ఆత్మహత్య
X

దిశ, కంటోన్మెంట్: కరోనా ఓ ఇంటర్ విద్యార్థి జీవితంలో విషాదాన్ని నింపింది. ఆన్ లైన్ క్లాసులు అర్దం కాకపోవడంతో.. తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మ హత్య చేసుకున్న బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ కథనం ప్రకారం.. బోయిన్‌పల్లి, కంసారి బజార్‌కు చెందిన ఆశోక్ కుమార్ కుమారుడు యశ్వంత్ (18) మారేడ్‌పల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ(హెచ్ఈసీ) సంవత్సరం చదువుతున్నాడు.

యశ్వంత్‌కు లాయర్ కావాలని డ్రీమ్ ఉంది. అయితే కరోనా వల్ల కళాశాల ప్రారంభం కాకపోవడం.. చదువులో ఎక్కడ వెనుకబడి పోతానోనన్న భయం అతన్ని వెంటాడింది. దీంతో ఇటీవల ప్రత్యేక కోచింగ్ తీసుకునేందుకు ఆన్ లైన్ క్లాసులకు హాజరవుతున్నాడు. కాగా ఇన్నాళ్లు రెగ్యులర్ తరగతులను హాజరైన యశ్వంత్‌కు ఆన్ లైన్ క్లాసులు అర్ధం కావడం లేదు. దీంతో తీవ్ర మానసిక క్షోభకు గురయ్యాడు. ఈ విషయాన్ని తన స్నేహితులతో చెప్పుకొని బాధపడేవాడు.

కరోనా ఇప్పట్లో పోదని, తాను లాయర్ కాలేమోనని బాధపడేవాడు. ఆదివారం మధ్యాహ్నం తన గదిలోకి వెళ్లి సీలింగ్ ఫ్యాన్ కు ఊరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గదిలో నుంచి యశ్వంత్ బయటకు రాకపోవడంతో కుటుంబసభ్యులు తలుపుతట్టారు. ఎంతకూ తీయకపోవడంతో తలుపు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా, ఫ్యాన్‌కు విగత జీవిగా వెలాడుతూ కన్పించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరిపారు.


Next Story

Most Viewed