యుద్ధభూమిలో నేలకొరిగిన సిక్కోలు సింహం

by  |
యుద్ధభూమిలో నేలకొరిగిన సిక్కోలు సింహం
X

దిశ ఏపీ బ్యూరో: సరిలేరు నీకెవ్వరు సినిమాలో మహేష్ బాబు బాంబు నిర్వీర్యం చేసేందుకు వెళ్తే.. హీరోయిజం చూసి పొంగిపోయాం.. అలా బాంబులు నిర్వీర్యం చేస్తూ సిక్కోలుకి చెందిన రియల్ హీరో లావేటి ఉమామహేశ్వరరావు (37) యుద్ధ భూమిలో వీరమరణం పొందారు. కశ్మీర్‌లో నిత్యం ఏదోఒక ప్రాంతంలో యుద్ధనాదం వినిపిస్తుందన్న సంగతి తెలిసిందే. సైనికుల నుంచి తప్పించుకునేందుకు శత్రువు భూమిలో బాంబులు పాతుతారు. కొన్ని సార్లు శత్రువు రాకను నిరోధించేందుకు మన సైనికులే ల్యాండ్ మైన్లు పెడతారు. వీటిని ఒడుపుగా నిర్వీర్యం చేస్తూ సైనికులు శత్రువు భరతం పడతారు.

కార్గిల్‌ సమీపంలో గల్వాన్‌కు 100 కిలోమీటర్ల దూరంలో శ్రీకాకుళంలోని హడ్కో కాలనీకి చెందిన లావేటి ఉమామహేశ్వరరావు బాంబులు నిరీర్యం చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు ఓ బాంబు పేలిపోయింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆయనను సమీపంలోని ఆస్పత్రికి తీసుకువెళ్లగా.. చికిత్స ప్రారంభించిన అర్ధగంటకే మృత్యువాత పడ్డారు. ఉమామహేశ్వరావు 2003 మార్చిలో సైన్యంలో చేరారు. 17 ఏళ్ల సర్వీసు పూర్తయింది. మరోరెండేళ్లలో ఆయన సర్వీసుకు స్వస్థిచెప్పాల్సి ఉంది. ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. ఫిబ్రవరిలో సెలవులపై వచ్చిన ఆయన శ్రీకాకుళంలో భార్యా పిల్లలతో ఉన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి విధించిన లాక్‌డౌన్‌‌కు వారం రోజుల ముందు ఉన్నతాధికారుల నుంచి ఫోన్ రావడంతో విధుల్లోకి వెళ్లారు. శనివారం ఉదయం బాంబులను వెతికే క్రమంలో తన స్నేహితులు తీసిన ఫొటోలను కూడా భార్యాపిల్లలకు వాట్స్ యాప్ ద్వారా పంపించారు. ఎక్కడ పని చేస్తున్నదీ వివరించారు. భార్యతో మాట్లాడి, క్షేమంగా ఉన్నానని చెప్పారు. మధ్యాహ్నానికి బాంబు వెతికే క్రమంలో ప్రమాదవశాత్తూ పేలి మరణించారు.

ఈ మేరకు ఆయన కుటుంబ సభ్యులకు ఉన్నతాధికారులు సమాచారం అందించారు. ఆయనకు భార్య నిరూష (32), వైష్ణవి (10), పరిణితి (4) ఇద్దరు పిల్లలు ఉన్నారు. దీనిపై నిరూష మాట్లాడుతూ, తన భర్త దేశ రక్షణ కోసం పోరాడుతూ ప్రాణాలు అర్పించడం గర్వంగా ఉన్నప్పటికీ పిల్లలింకా చిన్నవాళ్లే కావడంతో ఆందోళనగా ఉందని అన్నారు. వచ్చేనెల పుట్టిన రోజు జరుపుకోవాల్సిన ఆయన మరణవార్త వినాల్సి వస్తుందని ఊహించలేదని ఆమె కన్నీరుమున్నీరయ్యారు.


Next Story

Most Viewed