'ఆ నిధులను ప్రభుత్వం ఏం చేసింది..?'

by  |
ఆ నిధులను ప్రభుత్వం ఏం చేసింది..?
X

దిశ. కాటారం: కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు ఆరోగ్య శ్రీలో చేర్చాలని మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కోవిడ్ ను అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విఫలమయ్యాయని, శాస్త్రీయ బద్ధంగా సరైన పద్ధతులు పాటించకపోవడం వల్లే వ్యాధి విజృంభిస్తోందని ఆరోపించారు. అసెంబ్లీలో మాస్కులు, గ్లౌజులు అందుబాటులో లేవని అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులు మాట్లాడితే ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యంగ్యంగా మాట్లాడారన్నారు. కరోనా రాదని పారాసిటమాల్ వేసుకుంటే సరిపోతుందని మాట్లాడిన కేసీఆర్ ఎలాంటి ముందస్తు రక్షణ చర్యలు తీసుకోకుండానే లాక్ డౌన్ ప్రకటించారని విమర్శించారు. కనీసం వైద్య సిబ్బందికి కూడా మాస్క్ లు, గ్లౌజులు అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకోలేదన్నారు. మంథని ప్రాంతంలో ఉన్న ఇసుక క్వారీలకు వచ్చే ఇతర ప్రాంతాల లారీ డ్రైవర్ల ద్వారా కరోనా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని దీన్ని అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేరళ, మహారాష్ట్ర ప్రభుత్వాలు పగడ్బందీగా కరోనా నియంత్రణ చర్యలు తీసుకుంటుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. హైదరాబాదులో మనోజ్ అనే విలేఖరి చనిపోతూ ఎలాంటి సౌకర్యాలు లేవని అలాగే రెండు రోజుల క్రితం మరో యువకుడు డాడీ నన్ను రక్షించండి కనీసం వెంటిలేటర్ కూడా పెట్టడం లేదని బాధపడుతూ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయంటే ప్రభుత్వ నిర్లక్ష్యం ఎంతమేరా ఉందో అర్థం చేసుకోవచ్చని శ్రీధర్ బాబు అన్నారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన కొవిడ్ 19 నిధులు ఏం చేశారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. హైదరాబాదులో భారీగా కరోనా కేసులు నమోదు అవుతున్నందున ప్రవేశ పరీక్షలు వాయిదా వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


Next Story

Most Viewed