ఇంగ్లాండ్‌ టూరుకు రోహిత్ దూరం?.. కారణం అదేనా?

by Harish |   ( Updated:2025-03-27 13:52:02.0  )
ఇంగ్లాండ్‌ టూరుకు రోహిత్ దూరం?.. కారణం అదేనా?
X

దిశ, స్పోర్ట్స్ : ప్రస్తుతం భారత ఆటగాళ్లు ఐపీఎల్-2025లో బిజీగా ఉన్నారు. ఈ లీగ్ తర్వాత టీమిండియా జూన్‌లో ఐదు టెస్టుల సిరీస్ కోసం ఇంగ్లాండ్‌కు వెళ్లనుంది. కీలకమైన ఈ టెస్టు సిరీస్‌కు భారత జట్టును ప్రకటించాల్సి ఉంది. అయితే, ఇంగ్లాండ్ టూరుకు కెప్టెన్ రోహిత్ శర్మ దూరంగా ఉండనున్నట్టు సంబంధిత వర్గాలు జాతీయ మీడియాకు తెలిపాయి. టెస్టుల్లో పేలవ ఫామ్ కారణంగానే అతను ఈ నిర్ణయం తీసుకున్నాడని పేర్కొన్నాయి.

ఏడాది కాలంగా టెస్టుల్లో రోహిత్ ప్రదర్శన ఏమాత్రం బాగా లేదు. గతేడాది మార్చిలో ఇంగ్లాండ్‌పై అతను చివరి శతకం బాదాడు. ఆ తర్వాత ఫామ్ లేమితో తంటాలు పడుతున్నాడు. 15 ఇన్నింగ్స్‌లో ఒక హాఫ్ సెంచరీ మాత్రమే చేశాడు. 9 సార్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యాడు. ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కూడా దారుణంగా విఫలమయ్యారు. మూడు మ్యాచ్‌ల్లో 31 రన్సే చేశాడు. పేలవ ఫామ్ కారణంగా చివరిదైన ఐదో టెస్టు నుంచి రోహిత్ తప్పుకున్న విషయం తెలిసిందే. అప్పుడు టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటిస్తాడని వార్తలు రాగా.. రోహిత్ ఖండించాడు. పేలవ ఫామ్ నేపథ్యంలో ఇంగ్లాండ్ టూరుకు దూరంగా ఉండాలని హిట్‌మ్యాన్ నిర్ణయించుకున్నట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

Next Story