పంత్ ఈజ్ బ్యాక్..సెంచరీతో టెస్టుల్లోకి రీఎంట్రీ ఇచ్చిన రిషబ్

by Harish |
పంత్ ఈజ్ బ్యాక్..సెంచరీతో టెస్టుల్లోకి రీఎంట్రీ ఇచ్చిన రిషబ్
X

దిశ, స్పోర్ట్స్ : 2022 డిసెంబర్ 30. రిషబ్ పంత్ కెరీర్‌ను ప్రమాదంలో పడేసిన తేదీ. ఘోర కారు ప్రమాదానికి గురై చావు అంచుల దాకా వెళ్లొచ్చాడు. ఇక, పంత్ కెరీర్ ముగిసినట్టే అని చాలా మంది అనుకున్నారు. కానీ, అతనో అసాధ్యుడు. కోలుకుని తిరిగి మైదానంలో అడుగుపెట్టాడు. ఐపీఎల్‌లో మెరిశాడు. ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్‌ కూడా ఆడాడు. కానీ, క్రికెట్ ఫ్యాన్స్ ఎదురుచూసింది అతను టెస్టుల్లోకి ఎప్పుడు రీఎంట్రీ ఇస్తాడని. సుదీర్ఘ ఫార్మాట్‌లో అతని ఆటకు అభిమాని అవని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. పంత్ ఆడితే అది టెస్టు మ్యాచ్ అని మర్చిపోవాల్సిందే. ఏ టీ20 మ్యాచో, వన్డే మ్యాచో అనుకుంటాం. మరి, రీఎంట్రీలోనూ అలాగే ఆడతాడా? అన్న అనుమానాలను పటాపంచలు చేశాడు.

635 రోజుల నిరీక్షణ తర్వాత బంగ్లాదేశ్‌పై పంత్ టెస్టుల్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. అదే బ్యాటింగ్. అదే దూకుడు. ఏం మారలేదు. తొలి ఇన్నింగ్స్‌లో 39 పరుగులు చేసి అవుటైనా.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం అదరగొట్టాడు. బంగ్లా బౌలర్లను ఊతికారేశాడు. సెంచరీతో టెస్టుల్లోకి కమ్ బ్యాక్ ఇచ్చాడు. 128 బంతుల్లో 109 పరుగులు చేశాడు. అందులో 13 ఫోర్లు, 4 సిక్స్‌లు ఉన్నాయి. పంత్ క్రీజులోకి వచ్చే సమయానికి గిల్ 31 పరుగులతో ఉన్నాడు. గిల్ కంటే ముందే పంత్ సెంచరీ పూర్తి చేశాడటంటే అతను బ్యాటు ఝుళిపించిన తీరును అర్థం చేసుకోవచ్చు.

ముఖ్యంగా 50-100 వరకు పాత పంత్‌ను చూడొచ్చు. 80 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన అతను మరో 36 బంతుల్లోనే శతకం నమోదు చేశాడు. టెస్టుల్లో పంత్‌కు ఇది 6వ శతకం. దీంతో పంత్ ఓ ఘనత సాధించాడు. టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన భారత వికెట్ కీపర్‌గా ఎం.ఎస్ ధోనీ పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు. ధోనీ 90 టెస్టుల్లో ఈ మైలురాయిని చేరుకోగా.. పంత్ కేవలం 34 మ్యాచ్‌ల్లోనే ఈ ఫీట్ సాధించాడు. మరో సెంచరీ చేస్తే ధోనీని అధిగమిస్తాడు.

Next Story

Most Viewed