శతక్కొట్టిన రోహిత్, జడేజా.. మూడో టెస్టులో తొలి రోజు భారత్‌దే ఆధిపత్యం

by Harish |   ( Updated:2024-02-15 13:58:27.0  )
శతక్కొట్టిన రోహిత్, జడేజా.. మూడో టెస్టులో తొలి రోజు భారత్‌దే ఆధిపత్యం
X

దిశ, స్పోర్ట్స్ : రాజ్‌కోట్‌లో తొలి రోజు టీమ్ ఇండియాదే. కెప్టెన్ రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా శతక్కొట్టిన వేళ మూడో టెస్టును భారత్‌ మెరుగ్గా ఆరంభించింది. రాజ్‌కోట్ వేదికగా గురువారం మూడో టెస్టు ప్రారంభమవ్వగా తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 5 వికెట్లను కోల్పోయి 326 పరుగులు చేసింది. అయితే, భారత్ ఇన్నింగ్స్‌ ఆరంభంలో తడబడింది. యశస్వి జైశ్వాల్(10), శుభ్‌మన్ గిల్(0), రజత్ పాటిదార్(5) నిరాశపర్చడంతో 33 పరుగులకే 3 వికెట్లు పడ్డాయి. ఆ తర్వాత రోహిత్ శర్మ(131), రవీంద్ర జడేజా(110 నాటౌట్) సెంచరీలతో జట్టును ఆదుకున్నారు. నాలుగో వికెట్‌కు ఈ జోడీ 204 పరుగులు జోడించింది. రోహిత్ అవుటవడంతో ఈ జోడీకి తెరపడగా.. క్రీజులోకి వచ్చిన సర్ఫరాజ్ ఖాన్(62) అరంగేట్ర మ్యాచ్‌లోనే దూకుడు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. జడేజాతోపాటు కుల్దీప్ యాదవ్( 1నాటౌట్) క్రీజులో ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో మార్క్‌వుడ్ 3 వికెట్లు పడగొట్టగా.. టామ్ హార్ట్లీకి ఒక్క వికెట్ దక్కింది.

33కే 3 వికెట్లు

టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన టీమ్ ఇండియాకు శుభారంభం దక్కలేదు. గత రెండు మ్యాచ్‌ల్లో రాణించిన ఓపెనర్ యశస్వి జైశ్వాల్(10) ఈ సారి నిరాశపరిచాడు. తొలి బంతినే ఫోర్ కొట్టి ఇన్నింగ్స్‌ను ధాటిగానే ప్రారంభించిన అతను మార్క్‌వుడ్ బౌలింగ్‌లో క్యాచ్ అవుటయ్యాడు. వైజాగ్ టెస్టులో సెంచరీ ఫామ్‌ అందుకున్న గిల్(0) సైతం నిరాశపరిచాడు. 9 బంతులు ఎదుర్కొన్న అతను ఖాతా కూడా తెరవకుండానే వెనుదిరిగాడు. రజత్ పాటిదార్(5) మరోసారి నిరాశపరిచాడు. దీంతో భారత్ 33 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి తడబడింది.

రోహిత్, జడేజా అండతో

10 ఓవర్లలోపు 3 వికెట్లు కోల్పోవడంతో భారత్ కష్టాల్లో పడేలా కనిపించింది. ఈ పరిస్థితుల్లో కెప్టెన్ రోహిత్ శర్మ, జడేజా అద్భుతమైన ఆటతో జట్టుకు అండగా నిలిచారు. రోహిత్ 27 పరుగుల వద్ద క్యాచ్ అవుటయ్యేవాడు. రూట్ బంతి అందుకోకపోవడంతో రోహిత్ ఊపరి పీల్చుకున్నాడు. లేదంటే భారత్ తీవ్ర కష్టాల్లో పడేదేమో. చాలా రోజుల తర్వాత రోహిత్ చక్కటి ఇన్నింగ్స్ ఆడగా.. సొంతగడ్డపై జడేజా చెలరేగాడు. వీరు ఆచితూచి ఆడుతూనే చెత్త బంతులను బౌండరీలు బాదుతూ ఇన్నింగ్స్ నిర్మించారు. క్రీజులో పాతుకపోయిన ఈ జోడీ ఇంగ్లాండ్ బౌలర్లకు పరీక్ష పెట్టింది. ఈ క్రమంలో రోహిత్ హాఫ్ సెంచరీ చేయగా.. కాసేపటికే భారత్ 93/3 స్కోరు వద్ద లంచ్‌కు వెళ్లింది. విరామం తర్వాత కూడా ఈ జోడీ ఇంగ్లాండ్ బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారింది. ఆచితూచి ఆడిన జడేజా సైతం అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. మరోవైపు, సెంచరీకి చేరువైన రోహిత్.. టీ విరామం తర్వాత టెస్టుల్లో 11వ శతకాన్ని పూర్తి చేశాడు. అలాగే, చివరి సెషన్‌లో ఈ జంట దూకుడు పెంచింది. వీరు బౌండరీలతో బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. ఈ క్రమంలో 150 పరుగుల మార్క్ దిశగా వెళ్తున్న రోహిత్‌.. మార్క్‌వుడ్ బౌలింగ్‌లో క్యాచ్ అవుటయ్యాడు. దీంతో నాలుగో వికెట్‌కు 204 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

దూకుడుగా ఆడిన సర్ఫరాజ్

అరంగేట్ర మ్యాచ్‌లోనే సర్ఫరాజ్ ఖాన్ నిరూపించుకున్నాడు. రోహిత్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన అతను దేశవాళీ దూకుడును ఈ మ్యాచ్‌లోనూ కొనసాగించాడు. జడేజాతో కలిసి ఐదో వికెట్‌కు 77 పరుగులు జోడించాడు. మొదట్లో ఇన్నింగ్స్‌ను నిదానంగా ఆరంభించిన సర్ఫరాజ్ రెహాన్ అహ్మద్ బౌలింగ్‌లో ఫోర్ కొట్టి గేర్ మార్చాడు. ఆ తర్వాత ఓవర్‌కో ఫోర్ కొట్టాడు. దీంతో చూస్తుండగానే హాఫ్ సెంచరీకి చేరువైన అతను 48 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించాడు. అయితే, అదే దూకుడు కొనసాగించే క్రమంలో అండర్సన్ బౌలింగ్‌లో సర్ఫరాజ్ ఖాన్(62) రనౌటయ్యాడు. జడేజా సింగిల్ తీసేందుకు పిలువగా బంతిని అందుకున్న మార్క్‌వుడ్ డైరెక్ట్ త్రోతో సర్ఫరాజ్‌ను అవుట్ చేశాడు. ఆ తర్వాతి బంతికే జడేజా(110 నాటౌట్) శతకం పూర్తి చేసి అజేయంగా నిలిచాడు. అతనితోపాటు కుల్దీప్ యాదవ్( నాటౌట్) క్రీజులో ఉన్నారు.

స్కోరుబోర్డు

భారత్ తొలి ఇన్నింగ్స్ : 325/5(86 ఓవర్లు)

యశస్వి జైశ్వాల్(సి)రూట్(బి)మార్క్‌వుడ్ 10, రోహిత్(సి)స్టోక్స్(బి)మార్క్‌వుడ్ 131, శుభ్‌మన్ గిల్(సి)ఫోక్స్(బి)మార్క్‌‌వుడ్ 0, రజత్ పాటిదార్(సి)డక్కెట్(బి)టామ్ హార్ట్లీ 5, జడేజా 110 బ్యాటింగ్, సర్ఫరాజ్ ఖాన్ రనౌట్(మార్క్‌వుడ్) 62, కుల్దీప్ యాదవ్ 1 బ్యాటింగ్; ఎక్స్‌ట్రాలు 7.

వికెట్ల పతనం : 22-1, 24-2, 33-3, 237-4, 314-5

బౌలింగ్ : అండర్సన్(19-5-51-0), మార్క్‌వుడ్(17-2-69-3), టామ్ హార్ట్లీ(23-3-81-1), జోరూట్(13-1-68-0), రెహాన్ అహ్మద్(14-0-53-0)

Advertisement

Next Story

Most Viewed