Asian Champions Trophy : సౌత్ కొరియాను చిత్తు చేసిన భారత హాకీ జట్టు.. సెమీస్‌కు క్వాలిఫై

by Harish |
Asian Champions Trophy : సౌత్ కొరియాను చిత్తు చేసిన భారత హాకీ జట్టు.. సెమీస్‌కు క్వాలిఫై
X

దిశ, స్పోర్ట్స్ : చైనా వేదికగా జరుగుతున్న ఏషియన్ చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌లో భారత పురుషుల జట్టుకు తిరుగులేకుండా పోయింది. వరుస విజయాలతో దూసుకెళ్తోంది.టోర్నీలో నాలుగో విజయాన్ని నమోదు చేసి సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది. గురువారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 3-1 తేడాతో సౌత్ కొరియాను చిత్తు చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ రెండు గోల్స్‌తో సత్తాచాటడంతో మ్యాచ్‌లో భారత జట్టు స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించింది.

తొలి క్వార్టర్‌లోనే రెండు గోల్స్ చేసింది. 7వ నిమిషంలో అరైజీత్ సింగ్ గోల్ చేసి భారత్ ఖాతా తెరవగా.. ఆ తర్వాతి నిమిషంలోనే దక్కిన పెనాల్టీ కార్నర్‌ను కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ గోల్‌గా మలిచాడు. ఆ గోల్‌తో హర్మన్‌ప్రీత్ కీలక మైలురాయిని సాధించాడు. జాతీయ జట్టు తరపున 200వ గోల్ చేశాడు. దీంతో తొలి క్వార్టర్‌లోనే భారత్ 2-0తో ఆధిక్యంలోకి వెళ్లి పట్టు సాధించింది. దీంతో కొరియాపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలో 30వ నిమిషంలో యాంగ్ ఆ జట్టు తరపున గోల్ చేసి భారత్ ఆధిక్యాన్ని 2-1కు తగ్గించి ఊరటనిచ్చాడు.

అనంతరం ప్రత్యర్థికి భారత డిఫెన్స్ అడ్డుకట్ట వేసింది. అలాగే, 43వ నిమిషంలో హర్మన్‌ప్రీత్ సింగ్ మరో గోల్ చేసి జట్టును 3-1తో లీడ్‌లోకి తీసుకెళ్లాడు. చివరి క్వార్టర్‌లో కొరియా స్కోరును సమం చేయడానికి ప్రయత్నించి విఫలమవడంతో భారత్‌ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో హర్మన్‌ప్రీత్ సేన సెమీస్‌కు అర్హత సాధించింది. పాయింట్స్‌ టేబుల్ 12 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నది. తొలి రౌండ్‌లో శనివారం పాకిస్తాన్‌‌తో భారత్ చివరి మ్యాచ్ ఆడనుంది. సెమీస్‌కు క్వాలిఫై అవడంతో ఈ మ్యాచ్ నామమాత్రమే కానుంది.

Advertisement

Next Story

Most Viewed