IND VS AUS : రాహుల్ ఔట్.. మార్ష్‌ నాటౌట్.. వివాదాస్పదమవుతున్న థర్డ్ అంపైర్ నిర్ణయాలు

by Harish |
IND VS AUS : రాహుల్ ఔట్.. మార్ష్‌ నాటౌట్.. వివాదాస్పదమవుతున్న థర్డ్ అంపైర్ నిర్ణయాలు
X

దిశ, స్పోర్ట్స్ : బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో థర్డ్ అంపైర్ నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. పెర్త్ టెస్టులో కేఎల్ రాహుల్ అవుటైన తీరుపై ఇంకా చర్చ జరుగుతుండగానే.. రెండో టెస్టులో మిచెల్ మార్ష్‌ను నాటౌట్‌గా ప్రకటించడం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. రెండు సందర్భాల్లోనూ టీమిండియాకు ప్రతికూలే నిర్ణయాలే రావడం గమనార్హం. అడిలైడ్ టెస్టులో లబుషేన్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన మిచెల్ మార్ష్(9) కాసేపటికే అశ్విన్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. 58వ ఓవర్‌లో అశ్విన్ వేసిన మూడో బంతిని మార్ష్ ముందుకొచ్చి డిఫెన్స్ చేయబోయాడు. బంతి ప్యాడ్‌కు తాకిందని టీమిండియా అప్పీలు చేసింది. ఫీల్డ్ అంపైర్ నాటౌట్‌ ఇవ్వడంతో భారత్ డీఆర్‌ఎస్ తీసుకుంది. అయితే, థర్డ్ అంపైర్ మిచెల్ మార్ష్ నాటౌట్ అని తేల్చాడు. ‘బంతి మొదట బ్యాటుకు లేదా ప్యాడ్‌కు తాకిందా అనడానికి సరైన ఆధారాలు లేవు' అని పేర్కొన్నాడు. సమీక్షలో బంతి ప్యాడ్‌కు తాకినట్టు స్పష్టంగా కనిపించింది. అలాగే, థర్డ్ అంపైర్ బాల్ ట్రాకింగ్‌‌ను చూడకుండా కేవలం స్నికో రీడింగ్ ఆధారంగానే నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కాసేపటికే అశ్విన్ బౌలింగ్‌లోనే మార్ష్.. పంత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

రాహుల్ విషయంలో అలా

తొలి టెస్టులో రాహుల్ విషయంలో మాత్రం థర్డ్ అంపైర్ మరో విధంగా నిర్ణయం తీసుకున్నాడు. ఫీల్డ్ అంపైర్ నాటౌట్ అని ఇచ్చిన నిర్ణయాన్ని మార్చి అవుట్‌గా తేల్చాడు. స్టార్క్ బౌలింగ్‌లో బంతి రాహుల్ బ్యాటుకు, అదే సమయంలో బ్యాటు ప్యాడ్‌కు తగిలింది. ఫీల్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించగా.. ఆసిస్ ప్లేయర్లు రివ్యూ తీసుకున్నారు. సమీక్షలో స్పైక్స్ వచ్చాయి. కానీ, బంతి ముందుగా బ్యాటు తాకినట్టు స్పష్టత లేదు. థర్డ్ అంపైర్ బెన్‌ఫిట్ ఆఫ్ డౌట్‌ కింద రాహుల్‌‌‌ను నాటౌట్‌గా ఇవ్వాల్సింది పోయి అవుట్‌గా ప్రకటించాడు. మిచెల్ మార్ష్ విషయంలో మాత్రం స్పష్టత లేదనే కారణంతో నాటౌట్‌గా ఇచ్చాడు. దీంతో మరోసారి థర్డ్ అంపైర్‌ నిర్ణయం వివాదాస్పదమవ్వగా.. చెత్త అంపైరింగ్ అంటూ భారత అభిమానులు సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. మార్ష్ క్లియర్‌గా అవుటేనని కామెంట్లు పెడుతున్నారు. అలాగే, టీమిండియాకు ప్రతికూల నిర్ణయాలపై కూడా ఫైర్ అవుతూ ఆస్ట్రేలియా చీటింగ్ చేస్తుందంటూ ఆరోపణలు చేస్తున్నారు.

కోహ్లీ ఫైర్

థర్డ్ అంపైర్ నిర్ణయంపై విరాట్ కోహ్లీ ఫైర్ అయ్యాడు. మార్ష‌ను అవుట్‌గా ప్రకటించడానికి సరైన ఆధారాలు లేవన్న థర్డ్ అంపైర్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఫీల్డ్ అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. పెర్త్‌లో ఇలాంటి సందర్భంలోనే కేఎల్ రాహుల్‌ను ఔట్ ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు నాటౌట్ ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించాడు.



Next Story

Most Viewed