Disha Special: మిల్లెట్స్ మిస్టరీ.. ఆరోగ్యంలో మిరాకిల్స్ సృష్టిస్తోన్న చిరుధాన్యాలు

by Bhoopathi Nagaiah |   ( Updated:2025-03-07 16:00:14.0  )
Disha Special: మిల్లెట్స్ మిస్టరీ.. ఆరోగ్యంలో మిరాకిల్స్ సృష్టిస్తోన్న చిరుధాన్యాలు
X

న సంప్రదాయ పంటలు చిరుధాన్యాలు. ఇవి తరగని పోషకాల గనులు. ఆరోగ్య సిరులు.. కొర్రలు, సామలు, అండుకొర్రలు, అరికెలు, ఊదలు..వంటి సిరిధాన్యాలను అభివ్రుద్ది క్రమంలో మనం వీటికి దూరమయ్యాం. ఆధునిక జీవన శైలి, సరళీ తెస్తున్న అనారోగ్య సమస్యలకు చెక్ చెప్పటానికి సిరిధాన్యాల వాడకం తప్పని సరి అని ప్రక్రుతి నిపుణులు పదేపదే చెబుతుండడంతో, వీటికి ఇటీవల ప్రాముఖ్యత పెరుగుతోంది. గత ఐదేళ్లకింద కిలో మిల్లెట్స్ ధర రూ.100 ఉంటే ప్రస్తుతం కిలో ధర రూ.150 వరకు పలుకుతోంది. అంటే సిరిధాన్యాల వాడకం పెరగడమే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. మంచి ఆహారపు అలవాట్లే మనిషి ఆరోగ్య రహాస్యం. ఎన్నో పోషక విలువలు కలిగిన చిరుధాన్యాలను ప్రజలు మరిచిపోయారు. దాని పర్యవసానంగా ఎన్నో ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. ఎక్కువ కాలం బతకటం కన్నా ఎక్కువ ఆరోగ్యంతో బతకటం అవసరమని ఇప్పుడిప్పుడే అందరికి అవగాహన కలుగుతుంది. -స్వర్ణ మొలుగూరి

కొర్రలు, సామలు, అండుకొర్రలు, అరికెలు, ఊదలు, వరిగ ఈ పేర్లు మన అమ్మమ్మలు, నానమ్మల కాలం నాడు విరివిగా వినిపించినా కాలక్రమేణా అవి కనుమరుగై వాటి స్థానంలో వైట్ రైస్ కి ఎక్కువ ప్రాధాన్యత పెరిగింది. కొన్ని ఇళ్లలో అయితే ఒకప్పుడు సిరిధాన్యాలతో వండిన అన్నం పేదవాళ్లు మాత్రమే తింటారని, ఆర్థికంగా నిలదొక్కుకున్న వాళ్లు మాత్రమే అన్నం తినే వాళ్లని చెబుతుంటారు మన పూర్వీకులు...కానీ ఓడలు బండ్లు అయినట్లు ఆధునిక జీవనశైలితో వస్తున్న మార్పులకు అనుగుణంగా మిల్లెట్స్ తినాలంటే డబ్బు, సామాజిక హోదా కాదు, ఆరోగ్యం పట్ల స్పృహ ఉన్నవాళ్లు మాత్రమే తింటున్నారు. మారిన వాతావరణం, ఆరోగ్యపు ఆహార అలవాట్లపై ద్రుష్టి సారిస్తున్న నేపథ్యంలో సంప్రదాయ పంటలకు ఇప్పుడిప్పుడే ప్రాధాన్యత పెరుగుతున్నది. ధీర్ఘ కాలిక అనారోగ్య సమస్యలను అడ్డుకునేందుకు సిరిధాన్యాల వాడకం పెరుగుతుంది..ప్రభుత్వం కూడా సాగును ప్రోత్సహిస్తూ సబ్సిడీలు ఇస్తుండటం రైతులు పండించడానికి సుముఖంగా ఉంటున్నారు.

మారిన పరిస్థితులు

గత 50 సంవత్సరాలుగా వ్యవసాయం క్రమంగా మారుతూ వస్తుంది. రసాయనాలు, పురుగుమందుల అధికంగా వాడడంతో దాదాపు 50 నుంచి 60 శాతం మంది రైతులు వ్యవసాయానికి దూరమయ్యారు. ఎవరయితే నీటి సాగుకు అనుకూలంగా ఉన్నారో, వారు మాత్రమే వ్యవసాయం చేయడానికి అనువుగా కంపెనీలు మార్చుకున్నాయి. ఈ కంపెనీలు ఇచ్చే రసాయన ఎరువులు, పురుగుమందులు మన వ్యవసాయంలో చోటుచేసుకున్నాయి. ఇలా మన వ్యవసాయం రూపురేఖలు మారిపోయాయి. మన దేశంలో మనం పండించే పంటలు తినడం లేదు. ముందు వ్యవసాయంలో రైతుల చేతిలోనే విత్తనాలు, ఎరువులు తయారయ్యేవి. క్రమంగా ఇది పూర్తిగా మారిపోయింది. ఇలాగే ఆరోగ్య విషయంలో, వ్యవసాయంలో కూడా దెబ్బతిన్నాం.. కాబట్టి ఇప్పుడు మన పంటలు, అలాగే చిరుధాన్యాల ప్రాధాన్యత అందరికీ తెలియజేస్తే మన పేద రైతులు పండించే ఈ చిరుధాన్య పంటలకు కూడా మంచి విలువ వస్తుంది. మనం వరి అన్నం తినడానికి అలవాటు పడ్డాం కానీ చిరుధాన్యాలతో కూడా అన్నం వండుకోవచ్చని భావి తరాలకు చెప్పాల్సిన బాధ్యత మనందరి పైనా ఉంది.

సిరిధాన్యాల విశిష్టత

తక్కువ నీటితో రసాయన ఎరువులు, పురుగుమందుల అవసరం లేకుండా పండగలిగిన అత్యుత్తమ పోషకవిలువలు కలిగిన పంటలు సిరిధాన్యాలు.. మూడు పూటలా తిన్నప్పుడు ఆ రోజుకు మనిషికి అవసరమైన పీచుపదార్థం(ప్రతి ఒక్కరికి రోజుకు 38 గ్రాముల పీచుపదార్థం కావాలి) ఈ ధాన్యాల నుంచే లభిస్తుంది. తక్కిన పది గ్రాములు కూరగాయలు, ఆకు కూరల నుంచి పొందవచ్చు. చిరుధాన్యాల పోషకవిలువల్లో ప్రొటీన్ 10 శాతం, విటమిన్ బి12, బి17, బి6 సమృద్ధిగా ఉంటాయి.

పెరిగిన మిల్లెట్స్ వాడకం

గత ఐదేళ్లలో భారతదేశంలో చిరుధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. ఈ పెరుగుదలకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందించడంతో పాటు రైతుల్లో అవగాహన పెరగడం కూడా కీలకమైన అంశాలుగా పరిగణించవచ్చు. భారత ప్రభుత్వం చిరుధాన్యాల ఉత్పత్తిని పెంచడానికి వివిధ పథకాలను అమలు చేసింది. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్(National Food Security Mission) (ఎన్ఎఫ్ఎస్ఎం) కింద రైతులకు విత్తనాలు, ఎరువులు సాంకేతిక మద్దతు అందుతుంది. 2023ని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించడం చిరుధాన్యాల ప్రాముఖ్యతను పెంచింది. చిరుధాన్యాల పోషక విలువలు, పర్యావరణ ప్రయోజనాల గురించి రైతులకు అవగాహన పెరగడంతో, వారు ఈ పంటలను ఎక్కువగా పండించడం ప్రారంభించారు. గత ఐదేళ్లలో భారతదేశంలో చిరుధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. రాజస్థాన్, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు చిరుధాన్యాల ఉత్పత్తిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. ఈ పెరుగుదల భారతదేశంలో ఆహార భద్రతను పెంచడంలో, పర్యావరణ స్థిరత్వాన్ని కాపాడుకోవడంలో సహాయపడుతుంది. చిరుధాన్యాలు తక్కువ నీటి వినియోగంతో, వర్షాభావ ప్రాంతాలలో ఎక్కువగా పండుతాయని కాబట్టి కొన్ని ప్రాంతాల రైతులు వీటిని సాగు చేయడంలో ఆసక్తి కనబరుస్తారు.

గత ఐదేళ్లలో చిరుధాన్యాల ఉత్పత్తి:

తెలంగాణలో కూడా చిరుధాన్యాల ఉత్పత్తి పెరుగుతున్నది. సోర్గం, జొన్న, సజ్జలు వంటి చిరుధాన్యాలు ఎక్కువగా పండిస్తున్నారు. చిరుధాన్యాల వినియోగం కూడా పెరుగుతోంది. చిరుధాన్యాలు అధిక పోషక విలువలను కలిగి ఉంటాయి, ఇది వాటి డిమాండ్‌ను పెంచుతుంది. ప్రభుత్వం చిరుధాన్యాల వినియోగాన్ని పెంచడానికి వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నది.

తెలంగాణలో చిరుధాన్యాల ఉత్పత్తి:

చిరుధాన్యాలపై ఐఐఎంఆర్ పాత్ర

భారతదేశంలో చిరుధాన్యాల పరిశోధన, అభివృద్ధిలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ (Indian Institute of Millets Research)(ఐఐఎంఆర్) కీలక పాత్ర పోషిస్తున్నది. ఈ సంస్థ జొన్న, రాగులు, సామలు, అరికెలు మరియు కొర్రలు వంటి వివిధ రకాల చిరుధాన్యాలపై పరిశోధనలు నిర్వహిస్తుంది. ఐఐఎంఆర్ రైతులకు చిరుధాన్యాల ప్రాముఖ్యత, సాంకేతికతలపై అవగాహన కల్పిస్తుంది. ఇటీవల జరిగిన నేషనల్ మిల్లెట్ కిసాన్ మేళా వంటి కార్యక్రమాలు విత్తనాలు సాగు విధానాలతో పాటు పంటల స్థితిగతులను ఉత్పత్తుల నాణ్యతను పరిశీలించేందుకు క్రుత్రిమ మేధ సాంకేతికతను వినియోగిస్తున్నారు.

ప్రభుత్వ ప్రోత్సాహం

భారత ప్రభుత్వం చిరుధాన్యాలను న్యూట్రీసెరెల్స్‌గా ప్రోత్సహిస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో కూడా వీటిని ప్రచారం చేస్తున్నది. ఈ ప్రయత్నాల ఫలితంగా చిరుధాన్యాల వినియోగంతో పాటు ఉత్పత్తి పెరుగుతుంది. ఇటీవల హైదరాబాద్‌లో జాతీయ మిల్లెట్ కిసాన్ మేళాను నిర్వహించింది. ఈ కార్యక్రమం రైతులకు అత్యాధునిక సాంకేతికతలు, ఉత్తమ వ్యవసాయ పద్ధతులు అందించడంపై దృష్టి పెట్టింది. ఐఐఎంఆర్ మిల్లెట్ ఆహార ఉత్పత్తులకు రెడీ టు ఈట్, రెడీ టు కుక్ సాంకేతికతలను అభివృద్ధి చేసింది. మిల్లెట్ ఆహారాలను ఈట్‌రైట్ బ్రాండ్ కింద ప్రచారం చేస్తున్నది. ఐఐఎంఆర్.. మిల్లెట్స్ అండ్ అదర్ ఆన్సెంట్ గ్రెయిన్స్ ఇంటర్నేషనల్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (మహరిషి) కింద అంతర్జాతీయ సహకారాన్ని పెంచుతోంది. ఇటీవల జరిగిన కిసాన్ మేళాలో చిరుధాన్యాల రైతులకు పంట ఉత్పత్తుల రవాణాకు అయ్యే ఖర్చులో 50 శాతం భరించేందుకు త్వరలోనే దేశవ్యాప్తంగా కొత్త పథకాన్ని ప్రారంభించబోతున్నామని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయమంత్రి భగీరథ్ చౌదరి తెలిపారు. దీని ద్వారా రైతులకు లబ్ది చేకూరడమే కాక వినియోగదారులకు తక్కువ ధరలకు చిరుధాన్యాలు అందుబాటులో ఉంటాయన్నారు.

రైతుల్లో చైతన్యం కలిగిస్తున్నాం: తారా సత్యవతి, ఐఐఎంఆర్

చిరుధాన్యాలపై రైతుల్లో చైతన్యం కలిగించేందుకు ఐఐఎంఆర్ విశేష కృషి చేస్తున్నది. చిరుధాన్యాల సాగు ఏటేటా విస్తరిస్తోంది. రైతులకు దక్కే ధరలు, వ్యాపారులు, వినియోగదారులకు అమ్మే ధరల్లో అంతరం ఉంటుంది. దీనిని తగ్గించేందుకు రైతుకు అయ్యే రవాణా ఖర్చుల్లో 50 శాతం కేంద్రం చెల్లిస్తుంది. చిరుధాన్యాల సాగును లాభదాయకంగా మార్చడానికి మెరుగైన సాంకేతిక పరిజ్ణానాన్ని ప్రోత్సహించడంలో కేవీకేలు, రైతు ఉత్పత్తి సంఘాలు కీలకపాత్ర పోషించాలి.

Next Story

Most Viewed