కరీంనగర్‌‌ అంతటా ఇట్ల చేస్తే బాగుండు

by  |
కరీంనగర్‌‌ అంతటా ఇట్ల చేస్తే బాగుండు
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: మొన్నటి వరకు ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లి తమ సమస్యలు చెప్పుకోవడానికి జనం నానా తంటాలు పడేవారు. కలవాల్సిన ఆఫీసర్ లేకపోవడం, ఇతర పత్రాలు కావాలని అడగడం లాంటి వాటితో ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది.. కానీ, ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ తో ప్రతి ఆఫీస్ ఎదుట ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు. ఎవరికైనా సమస్యలు ఉంటే రిజస్టర్ లో ఎంటర్ చేసి వినతి పత్రం అక్కడే ఇవ్వాలనే పద్ధతి నడుస్తోంది. కొన్ని చోట్ల ఫిర్యాదు బాక్సులు కూడా ఏర్పాటు చేశారు. దీని ద్వారా ప్రజలకు ఆఫీసుల చుట్టూ తిరగడం తప్పడంతో పాటు.. కరోనాను కట్టడి చేసేందుకు అధికారులు ఈ తరహా చర్యలు తీసుకుంటున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మండల స్థాయి కార్యాలయాల్లో కరోనా కట్టడి కోసం స్పెషల్ కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. కలెక్టరేట్‌తో పాటు తహసీల్దార్ కార్యాలయాల్లో కౌంటర్ల ద్వారానే పిటిషన్లు తీసుకుంటున్నారు. కరోనా కట్టడి కోసమేనని అధికారులు చెప్తున్నారు.

కలెక్టరేట్‌లో కూడా..

కరీంనగర్ కలెక్టరేట్ లోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల ఎంట్రన్స్ వద్ద స్పెషల్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. కరోనా వ్యాధి విజృంభిస్తుండడంతో ఆయా శాఖల అధికారులు తమ కార్యాలయంలోకి రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అదే శాఖలో పనిచేసే వారైతే ఖచ్చితంగా శానిటైజ్ చేసుకున్న తరువాతే వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. వివిధ ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగులు అధికారులు పనుల నిమిత్తం జిల్లా కేంద్ర కార్యాలయాలకు వస్తూ పోతుంటారు. అలాగే సమస్యల పరిష్కారం కోసం ఎవరి ద్వారా వైరస్ వస్తుందోనన్న అనుమానంతో ఆయా కార్యాలయాల్లో ఈ జాగ్రత్త తీసుకుంటున్నారు. ఈ పద్ధతిని పలువురు అభినందిస్తున్నారు. కరోనా కట్టడికి అన్ని కార్యాలయాల్లో ఇలాంటి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


Next Story

Most Viewed