ప్రజల మన్ననలు పొందేలా సేవలుండాలి

by  |
ప్రజల మన్ననలు పొందేలా సేవలుండాలి
X

దిశ, నల్లగొండ : పోలీసులు సమర్ధవంతంగా విధులు నిర్వహిస్తూ, ప్రజల మన్ననలు పొందేలా సేవలందించాలని జిల్లా ఎస్పీ ఏవీ రంగనాధ్ అన్నారు. శనివారం ఆధునీకరించిన నల్లగొండ రూరల్ పోలీస్ స్టేషన్ ను డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి, రూరల్ ఎస్ఐ రాజశేఖర్ రెడ్డిలతో కలిసి ఎస్పీ ప్రారంభించారు. రూరల్ పీఎస్ పరిధిలోని అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్‌కు అనుసంధానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు మరింత చేరువ అవుతూ వారితో మమేకం కావడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. దేశంలో తెలంగాణ పోలీస్ శాఖ అగ్రభాగంలో ఉన్నదని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అన్ని స్థాయిల్లో వినియోగించుకుంటూ శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణలో ముందుకు సాగుతున్నామని వివరించారు. ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉంటూ వారికి సత్వర న్యాయం అందించేలా ఫ్రెండ్లీ పోలీసింగ్ దిశగా కృషి చేస్తున్నామని తెలిపారు.

అనంతరం రూరల్ పోలీస్ సిబ్బందితో మాట్లాడుతూ సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో భూ వివాదాలు, భూమికి సంబంధించిన సమస్యలు అత్యధికంగా వస్తుంటాయని అవి శాంతి భద్రతల సమస్యగా మారకుండా ఓపికతో రెవిన్యూ అధికారులను సమన్వయం చేసుకుంటూ పరిష్కరించాలని సూచించారు. పోలీస్ స్టేషన్ భవనాన్ని మంచి హంగులతో ఆధునీకరించడం అభినందనీయమని ఎస్ఐ రాజశేఖర్ రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం పీఎస్ ఆవరణలో హరిత హారంలో భాగంగా ఎస్పీ రంగనాధ్, డీఎస్పీ, ఇతర పోలీస్ అధికారులతో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో సీఐలు మహబూబ్ బాషా, నిగిడాల సురేష్, ట్రాఫిక్ సీఐ అనిల్, రూరల్ ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి, రూరల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఉమాపతి రావు,యాదగిరి,షరీఫ్ సురేందర్ రెడ్డి, శంకర్, రమేష్, నాగరాజు, ఆంజనేయులు, శివరాం, రాము, కిరణ్, రేణుక, జ్యోతి, మాధవి తదితరులు పాల్గొన్నారు.



Next Story