తల్లి మోసం చేస్తే కొడుకును కట్టేశారు

by  |
తల్లి మోసం చేస్తే కొడుకును కట్టేశారు
X

దిశ, వెబ్ డెస్క్: పశ్చిమ గోదావరి జిల్లా నలజర్లలో తల్లి చేసిన మోసానికి కొడుకును శిక్షించారు. చీటీల పేరుతో సుమారు 5 కోట్ల రూపాయలకు టోపీ పెట్టి గ్రామం విడిచి పారిపోయింది యాలాల వెంకటలక్ష్మి. దీంతో ఆమె కొడుకుని నల్లజర్ల గ్రామస్తులు శనివారం సాయంత్రం స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద వేప చెట్టుకు కట్టేశారు. తన తల్లి వచ్చి తమ డబ్బుకు సమాధానం చెప్పేంతవరకు వదిలేది లేదని గ్రామస్తులంతా భీష్మించారు.

వివరాల్లోకి వెళితే… గత ఎనిమిదేళ్లుగా వెంకటలక్ష్మి నల్లజర్ల చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజల వద్ద చీటీలపేరుతో సుమారు 5 కోట్ల రూపాయలు మేర వసూలు చేసింది. ఆపై డబ్బు ఇవ్వకుండా ఎగ్గొట్టి గ్రామం విడిచి వెళ్లి పోవడంతో ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ప్రజలంతా ఆందోళన చెందారు. అనంతరం నల్లజర్ల పోలీస్ స్టేషన్ లో మోసపోయినవారంతా కలిసి ఫిర్యాదు చేశారు. కొన్నిరోజుల తర్వాత ఆమె జంగారెడ్డిగూడెం వద్ద కనిపించడంతో పోలీసులు అదుపులోకి తీసుకొని నల్లజర్ల స్టేషన్ కు తీసుకువచ్చారు.

కొన్నిరోజుల విచారణ అనంతరం ఆమెను వదిలేయడంతో ఆ కేసు మరుగున పడింది. దీంతో గ్రామస్తులు, చుట్టుపక్కల ప్రజలంతా చేసేది లేక ఊరుకున్నారు. శనివారం వెంకటలక్ష్మి కుమారుడు నల్లజర్లలో కనిపించడంతో ప్రజలంతా ఏకమై అతన్ని చెట్టుకు కట్టి నిర్బంధించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని, అతనిని విడిచి పెట్టాలని కోరారు.

మాకు నష్టం చేకూర్చిన ఇతని తల్లిని మీరెందుకు వదిలేశారని గ్రామస్తులు ప్రశ్నించారు. ఆ రోజున ఆమెపై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేస్తే… అంతటితోనే అయిపోయేది. కానీ ఆ డబ్బు రప్పించి మీకు న్యాయం చేసేందుకే ఇప్పటివరకు ఆమెను అరెస్టు చేయలేదని పోలీసులు తెలిపారు. ఈ మాటలతో కొంతవరకు శాంతించిన గ్రామస్తులు లక్ష్మి కొడుకుని కట్లువిప్పి విడిచిపెట్టారు.



Next Story