కొడుకు కాఠిన్యం.. చచ్చిపోతామంటున్న వృద్ధ జంట 

by  |
కొడుకు కాఠిన్యం.. చచ్చిపోతామంటున్న వృద్ధ జంట 
X

దిశ, వెబ్ డెస్క్: గుంటూరు జిల్లాలో అమానుషంగా ప్రవర్తించాడు ఓ కసాయి కొడుకు. ఆస్తి రాయించుకుని జోరువానలో తల్లిదండ్రులను కొట్టి మరీ బయటకి తరిమేశాడు. కన్నకొడుకే కఠినంగా వ్యవహరించడంతో విషం తాగి చచ్చిపోతాం అంటూ రోదిస్తున్నారు ఆ వృద్ధ దంపతులు. పిడుగురాళ్ళ మండలం జానపాడు గ్రామంలో జరిగిన ఘటన పలువురిని కంటతడి పెట్టించింది.

తోడ పుట్టిన వారికి తెలియకుండా రామకృష్ణ అనే వ్యక్తి తల్లిదండ్రుల ఆస్తులను తన పేరున రాయించుకున్నాడు. విషయం తెలుసుకున్న పెద్ద కొడుకు రామకృష్ణని నిలదీసి ఆస్తులు తెలియకుండా ఎందుకు తీసుకున్నావ్ అని గొడవ పడ్డాడు. పెద్దల జోక్యంతో ఇరు కుటుంబాలు పోలీసులను ఆశ్రయించగా… పోలీసులు గొడవ పడకుండా పెద్ద మనుషుల సమక్షంలో ఎవరి ఆస్తులు వాళ్ళు జాగ్రత్తగా పంచుకోవాలని హెచ్చరించి పంపించారు.

దీంతో ఆగ్రహించిన రామకృష్ణ… నాపై కేసు పెడతారా అని తల్లిదండ్రులను వారు ఉంటున్న ఇంటి నుండి బయటకు వెళ్లగొట్టి అమానుషంగా ప్రవర్తించాడు. నవ మాసాలు మోసిన తల్లిని చేయిచేసుకున్నాడు. వృద్ధులను హింసించి ఇంటి నుంచి బయటకు గెంటేయడంతో గత మూడు రోజుల నుండి ఇంటి ముందే వర్షంలో తడుస్తూ కూర్చున్న ముసలి వాళ్ళని… నా కళ్ళ ఎదుట ఉండటానికి వీల్లేదని మెడపట్టి రోడ్డుపైకి నెట్టాడు.

గత్యంతరం లేక ఊరి చివర వున్న ఒక మండపంలో తలదాచుకుంటున్నారు. ఎండకి ఎండి వానకి తడుచుకుంటూ 80 సంవత్సరాల వృద్ధులు కొడుకు చేసిన నిర్వాకానికి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. అంతేకాదు, కనికరం లేని కొడుకు నుండి న్యాయం దొరక్కపోతే విషం తాగి చచ్చిపోతాం అంటూ ఆ పండు ముసలి దంపతులు బోరున విలపిస్తున్నారు.


Next Story

Most Viewed