షట్లర్ సాత్విక్ సాయిరాజ్‌కు కరోనా పాజిటివ్

by  |
షట్లర్ సాత్విక్ సాయిరాజ్‌కు కరోనా పాజిటివ్
X

దిశ, స్పోర్ట్స్ : ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అర్జున అవార్డు గ్రహీత, బ్యాడ్మింటన్ ఆటగాడు సాత్విక్ సాయిరాజ్ రాంకీ రెడ్డికి నిర్వహించిన రెండో టెస్టులో కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. సాత్విక్ తన సొంత ఊరైన అమలాపురంలోని ఇంట్లో ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నాడు. కొన్ని రోజుల క్రితం చేసిన ర్యాపిడ్ టెస్టులో పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆయన హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో నిర్వహిస్తున్న జాతీయ బ్యాడ్మింటన్ శిబిరానికి హాజరుకాలేదు.

తాజాగా చేసిన ఆర్టీపీసీఆర్ టెస్టులో కూడా అతడికి పాజిటివ్‌గా తేలింది. దీంతో ఈ నెల 29న హైదరాబాద్‌లో వర్చువల్‌గా నిర్వహించనున్న జాతీయ క్రీడా పురస్కారాలకు కూడా హాజరు కాలేకపోతున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్న సాత్విక్ జాతీయ మీడియాతో మాట్లాడుతూ ‘రెండో సారి కూడా కరోనా పాజిటివ్ రావడంతో చాలా అసంతృప్తిగా ఉన్నాను. ఇప్పటికే జాతీయ శిక్షణ శిబిరానికి దూరంగా ఉన్నాను. ఇప్పుడు అర్జున అవార్డు ప్రదానోత్సవంలో కూడా పాల్గొనలేకపోతున్నాను. త్వరలోనే కోలుకొని కోర్టులో అడుగుపెడతాను. నాతో పాటు ఉన్న కుటుంబ సభ్యులు ఎవరూ పాజిటివ్‌గా తేలలేదు. దీంతో నేనొక్కడినే ఒక గదిలో ఉంటున్నాను’ అని సాత్విక్ చెప్పుకొచ్చాడు. అంతర్జాతీయ స్థాయిలో చిరాగ్ శెట్టితో కలసి సాత్విక్ బ్యాడ్మింటన్ డబుల్స్ ఆడుతుంటాడు.


Next Story