బాక్సింగ్‌డే టెస్టు వేదికను మార్చొద్దు : వార్న్

by  |
బాక్సింగ్‌డే టెస్టు వేదికను మార్చొద్దు : వార్న్
X

దిశ, స్పోర్ట్స్ : ప్రతీ ఏడాది డిసెంబర్ 26న ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో బాక్సింగ్ డే టెస్టు నిర్వహిస్తారు. ఆ సమయంలో ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న జట్టుతో ఈ మ్యాచ్ నిర్వహిస్తారు. ఈ ఏడాది భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తుండటంతో బాక్సింగ్ డేస్టు ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగనుంది. అయితే ప్రస్తుతం విక్టోరియా రాష్ట్రంలో కోవిడ్-19 కేసులు విపరీతంగా పెరిగిపోవడంతో టెస్టు వేదికను అక్కడి నుంచి మార్చాలని వినతులు వస్తున్నాయి.

అయితే ఆసీస్ దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ మాత్రం బాక్సింగ్ డే టెస్టు వేదికను అక్కడి నుంచి మార్చవద్దని ట్విట్టర్ వేదికగా కోరాడు. ‘ప్రపంచంలో సాకర్ తర్వాత అతిపెద్ద క్రీడ క్రికెటే. అలాగే ఆస్ట్రేలియా క్రీడా క్యాలెండర్‌లో బాక్సింగ్ డే టెస్టు అనేది చాలా ప్రత్యేకమైనది. అయితే ఈ ఏడాది ఎంసీజీలో ఈ టెస్టు నిర్వహించడం కష్టం కావొచ్చనే అభిప్రాయం ఉంది. కానీ టెస్టు వేదికను మార్చడం వల్ల ప్రతికూల సంకేతాలు పంపినట్లు అవుతుంది. కాబట్టి బాక్సింగ్ డే టెస్టు వేదికను మార్చవద్దు’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. ఈ వారంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగనున్న వన్డే, టీ20, టెస్టు సిరీస్ షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో వార్న్ ట్వీట్ ప్రాధాన్యత సంతరించుకుంది.


Next Story