చైనా స్పాన్సర్లను సాగనంపండి: నెస్ వాడియా

by  |
చైనా స్పాన్సర్లను సాగనంపండి: నెస్ వాడియా
X

దిశ, స్పోర్ట్స్: ఇండియా, చైనా ఘర్షణల అనంతరం దేశవ్యాప్తంగా చైనా ఉత్పత్తులపై నిషేధం విధించాలనే డిమాండ్ పెరుగుతూ వస్తున్నది. ఇప్పటికే 59 చైనా యాప్స్‌ను కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసింది. మరోవైపు బీసీసీఐకి చైనా సంస్థలతో ఉన్న భాగస్వామ్యాన్ని పునఃసమీక్షించాలని కోరుతున్నారు. తాజాగా ఇలాంటి డిమాండే కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ సహ యజమాని నెస్ వాడియా ప్రతిపాదించారు. గతంలోనే ఇలాంటి డిమాండు చేయగా ఐపీఎల్‌తో వీవోకు ఉన్న భాగస్వామ్యం, ఇతర చైనా కంపెనీల ఒప్పందాలపై సోమవారం ఐపీఎల్ గవర్నింగ్ బాడీ సమావేశం కావాలని నిర్ణయించింది. కానీ, ఆ సమావేశం ఇంత వరకు జరగలేదు. దీనిపై నెస్ వాడియా మాట్లాడుతూ మన దేశం కోసం చైనా సంస్థలతో భాగస్వామ్యాన్ని తెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కరోనా సంక్షోభ సమయంలో వేరే స్పాన్సర్లను వెతకడం కొంచెం కష్టమైన పనే. కానీ, దేశం కోసం చైనా కంపెనీలను వదిలించుకోవడమే మంచిదని వాడియా అభిప్రాయపడ్డారు. మనం ఆడుతున్నది ఇండియన్ ప్రీమియర్ లీగే కానీ చైనీస్ ప్రీమియర్ లీగ్ కాదు కదా అని ఆయన ఎద్దేవా చేశారు. వెంటనే బీసీసీఐ ఈ ఒప్పందాలను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.



Next Story