- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

దిశ, వెబ్డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు ఈ వారం లాభాలతో ప్రారంభించాయి. ఉదయం ఉత్సాహంగా ప్రారంభమైన సూచీలు అనంతరం రోజంతా ఒడుదుడుకుల మధ్య ర్యాలీ చేశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు రావడంతో స్టాక్ మార్కెట్లు కొంత తడబడ్డాయని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అయితే, బ్యాంకింగ్, ఐటీ, ఆటో రంగాలకు చెందిన షేర్లు మార్కెట్ల లాభాలకు కీలక మద్ధతునిచ్చాయని నిపుణులు తెలిపారు. బీఎస్ఈ సెన్సెక్స్ ఉదయం వరకు 200 పాయింట్లకు పైగా లాభాలను సాధించినప్పటికీ మిడ్-సెషన్ తర్వాత ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడం వల్ల లాభాలు తగ్గాయని, ఆ తర్వాత ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్ లాంటి దిగ్గజ కంపెనీల షేర్లు అండగా నిలిచాయని నిపుణులు పేర్కొన్నారు.
దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 125.13 పాయింట్లు లాభపడి 54,402 వద్ద క్లోజవ్వగా, నిఫ్టీ 20.05 పాయింట్లు స్వల్ప లాభంతో 16,258 వద్ద ముగిసింది. నిఫ్టీలో మీడియా ఇండెక్స్ 1 శాతం మేర పుంజుకోగా, ప్రైవేట్ బ్యాంక్, బ్యాంకింగ్, ఫైనాన్స్, ఐటీ, హెల్త్కేర్ రంగాలు సానుకూలంగా కదలాడాయి. మెటల్, ఎఫ్ఎంసీజీ, రియల్టీ రంగాలు నీరసించాయి. సెన్సెక్స్ ఇండెక్స్లో ఎంఅండ్ఎం, యాక్సిస్ బ్యాంక్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్సర్వ్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఏషియన్ పెయింట్ షేర్లు లాభాలను దక్కించుకోగా, భారతీ ఎయిర్టెల్, టాటా స్టీల్, ఎన్టీపీసీ, ఎల్అండ్టీ, రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.28 వద్ద ముగిసింది.