లాభాల నుంచి నష్టాల్లోకి జారిన సూచీలు!

by  |
లాభాల నుంచి నష్టాల్లోకి జారిన సూచీలు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు మళ్లీ నష్టాలను నమోదు చేశాయి. ఆర్థిక వ్యవస్థకు అన్ని రకాలుగా అండగా ఉంటామని ఫెడరల్ రిజర్వ్ హమీతో బుధవారం అమెరికా మార్కెట్లు బలపడ్డాయి. ఈ పరిణామాలతో ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు తర్వాత ఫైనాన్షియల్‌, మెటల్, ఎనర్జీ‌ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో వరుసగా రెండో రోజూ నష్టాలను నమోదు చేశాయి. ట్రేడర్ల నిర్ణయాలతో మార్కెట్లు ఒడిదుడుకులకు లోనైనట్టు మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 335.06 పాయింట్లు కోల్పోయి 37,736 వద్ద ముగియగా, నిఫ్టీ 100.70 పాయింట్లను నష్టపోయి 11,102 వద్ద ముగిసింది. నిఫ్టీలో రంగాల వారీగా పరిశీలిస్తే..మీడియా, నిఫ్టీ బ్యాంక్, ఆటో, మెటల్ రంగాలు నష్టాల్లో ట్రేడవ్వగా, ఐటీ, ఫార్మా రంగాలు పుంజుకున్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో సన్‌ఫార్మా, మారుతీ సుజుకి, ఇన్ఫోసిస్, రిలయన్స్, హెచ్‌సీఎల్, టైటాన్, ఏషియన్ పెయింట్స్, టీసీఎస్ షేర్లు లాభాల్లో కదలాడగా, మిగిలిన సూచీలన్నీ నష్టాలను నమోదు చేశాయి. ముఖ్యంగా ఇండస్ఇండ్, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ బ్యాంక్, పవర్‌గ్రిడ్, ఎస్‌బీఐ షేర్లు అధిక నష్టాలను నమోదు చేశాయి.


Next Story