బ్యాంకింగ్ షేర్ల ఒత్తిడితో నష్టపోయిన మార్కెట్లు

by  |
బ్యాంకింగ్ షేర్ల ఒత్తిడితో నష్టపోయిన మార్కెట్లు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వారం ప్రారంభం భారీ నష్టాలను నమోదు చేశాయి. గత వారాంతం నష్టాల్లో ముగిసిన మార్కెట్లు.. సోమవారం నాటి ట్రేడింగ్‌లో భారీ నష్టాలను నమోదు చేశాయి. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాల కారణంగా ఉదయం ప్రారంభంలోనే నష్టపోయిన కీలక సూచీలు మిడ్ సెషన్‌కు ముందు కొంత నెమ్మదించాయి. అనంతరం అమ్మకాల ఒత్తిడితో సెన్సెక్స్ భారీగా నష్టపోయి 37 వేల దిగువకు చేరుకుంది.

మారటోరియం మరోసారి ఉండొచ్చన్న సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్‌ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. దీనికితోడు కొవిడ్-19 వ్యాప్తి‌ వేగంగా విస్తరిస్తున్న కారణంగా బలహీనమైన ప్రారంభాన్ని చూసిన మార్కెట్లు తర్వాతి పరిణామాల్లో మరింత క్షీణించాయి. పెట్టుబడిదారులు అమ్మకాలకు సిద్ధపడటంతో నష్టాలను మూటగట్టుకున్నాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 667.29 పాయింట్లను కోల్పోయి 36,939 వద్ద ముగియగా, నిఫ్టీ 173.60 పాయింట్లు నష్టపోయి 10,899 వద్ద ముగిసింది.

నిఫ్టీలో ముఖ్యంగా ప్రైవేట్ రంగ బ్యాంకులు అత్యధిక నష్టాల్లో ట్రేడవ్వగా, మీడియా, ఆటో, రియల్టీ, ఐటీ రంగాలు స్వల్పంగా క్షీణించాయి. ప్రభుత్వం రంగ బ్యాంకులు, మెటల్ రంగాలు లాభాల్లో ట్రేడయ్యాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో టైటాన్, టాటాస్టీల్, ఎస్‌బీఐ, ఎల్అండ్‌టీ, హెచ్‌సీఎల్, పవర్‌గ్రిడ్ షేర్లు మాత్రమే లాభాలను నమోదు చేశాయి. మిగిలిన సూచీలన్నీ నష్టాలను నమోదు చేశాయి. ప్రధానంగా కోటక్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఓఎన్‌జీసీ షేర్లు అత్యధికంగా నష్టపోయాయి.



Next Story