వరుస నష్టాల నుంచి కోలుకున్న మార్కెట్లు!

by  |
వరుస నష్టాల నుంచి కోలుకున్న మార్కెట్లు!
X

దిశ, వెబ్‌డెస్క్: వరుస నష్టాల నుంచి కోలుకున్న దేశీయ ఈక్విటీ మార్కెట్లు భారీ లాభాలను నమోదు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్ల పరిణామాలతో పాటు ఫ్యూచర్‌ గ్రూపునకు చెందిన రిటైల్‌ వ్యాపారం దక్కించుకునే ఒప్పందం‌ విషయంలో ముందడుగు పడిన వార్తలతో రిలయన్స్‌ షేర్లు ర్యాలీ చేశాయి. అంతేకాకుండా కొత్త సీఈవో నియామకానికి ఆర్‌బీఐ అనుమతిచ్చిన నేపథ్యంలో హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు దూకుడు పెంచాయి.

దీంతో ఉదయం నుంచే మార్కెట్లు లాభాలను చూశాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు సిద్ధపడటంతో మిడ్ సెషన్ తర్వాత నుంచి మార్కెట్లకు జోష్ పెరిగిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 748.31 పాయింట్లు ఎగిసి 37,687 వద్ద ముగియగా, నిఫ్టీ 211.25 పాయింట్ల లాభంతో 11,102 వద్ద ముగిసింది. నిఫ్టీలో ముఖ్యంగా ప్రైవేట్ బ్యాంకులు, మీడియా, రియల్టీ, మెటల్, ఫార్మా, ఆటో రంగాలు అత్యధికంగా ర్యాలీ చేయగా, ఐటీ రంగం మాత్రమే కొంత నీరసించింది.

సెన్సెక్స్ ఇండెక్స్‌లో రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, మారుతీ సుజుకి, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఆటో, సన్‌ఫార్మా, బజాజ్ ఫిన్‌సర్వ్, కోటక్ బ్యాంక్ షేర్లు అధిక లాభాలను నమోదు చేయగా, టెక్ మహీంద్రా, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్‌సీఎల్, ఆల్ట్రా సిమెంట్, ఇన్ఫోసిస్, టాటాస్టీల్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి.


Next Story