హేమంత్ హత్య కోసం పెద్ద స్కెచ్

by  |
హేమంత్ హత్య కోసం పెద్ద స్కెచ్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కలకలం రేపిన హేమంత్ హత్య కేసులో సంచలన నిజాలు వెలుగు చూశాయి. సినిమా క్లైమాక్స్ తరహాలో నిందితులు వేసిన పథకం.. బాధితులు తప్పించుకున్న తీరు.. చివరకు ప్రాణాలు తీసిన సంఘటనలు పోలీసుల విచారణలో బయటపడ్డాయి. ఇంత జరిగినా అసలు నిందితులు ఘటనా స్థలంలో కనిపించకుండా.. తెర వెనుక ఉండి సినిమా నడిపియడం గమనార్హం.

హత్యకు ముందు ఏం జరిగింది?

పూర్తి వివరాళ్లోకి వెళితే.. లింగంపల్లికి చెందిన లక్ష్మారెడ్డి-అర్చన దంపతుల కూతురు అవంతి రెడ్డి. అయితే, చందానగర్‌కు చెందిన హేమంత్-అవంతి ప్రేమించుకున్నారు. పెండ్లికి పెద్దలు నిరాకరించడంతో జూన్‌ నెల 10న అవంతి ఇంట్లో నుంచి వచ్చేసింది. దీంతో హేమంత్ ఆ మరుసటి రోజే అవంతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. కూతురు ఎంతకీ ఇంటికి రాకపోవడం పై తొలుత ఆందోళన చెందిన తల్లిదండ్రులు.. ప్రేమ పెండ్లి చేసుకుందని తెలుసుకొని పగ పెంచుకున్నారు. లో లోపల రగులుతూ.. అవమాన భారంతో ఏకంగా నాలుగు నెలల పాటు ఇంట్లోనే ఉండిపోయారు.

బాధ పడితే ప్రయోజనం లేదనుకున్నారో ఏంటో తెలియదు గానీ.. హేమంత్‌ను చంపివేయాలని ప్లాన్ చేసుకున్నారు. దీంతోనే అర్చన సోదరుడు యుగంధర్ రెడ్డికి జరిగిన విషయం చెప్పి.. లక్ష్మారెడ్డి హత్యకు ప్లాన్ వేశాడు. పెండ్లి చేసుకున్న తర్వాత అల్లుడు-కూతురు గచ్చిబౌలిలోనే కాపురం పెట్టారని తెలుసుకున్నారు. దీంతో ఏ ఇంట్లో ఉన్నారో తెలుసుకునేందుకు నెల ముందు నుంచే రెక్కీ నిర్వహించారు. దీంతో గచ్చిబౌలి టీఎన్జీవో కాలనీలో ఈ నెల 24న వారి ఆచూకీ గుర్తించిన యుగంధర్ రెడ్డి.. బంధువులు, కిరాయి హంతకులు హేమంత్ పై దాడికి దిగారు. అనంతరం అన్ని లింగంపల్లిలోనే మాట్లాడుకుందాం అంటూ.. కారు ఎక్కించారు. ఇదే సమయంలో హేమంత్-అవంతి పై దాడి చేశారు.

లింగంపల్లి అని చెప్పి గోపన్‌పల్లి వైపు కారు మళ్లీంచడం, కారులోనే దెబ్బలు తాళలేక హేమంత్-అవంతి కారు నుంచి పారిపోయే యత్నం చేశారు. కొంతదూరం పరుగుతీశారు. అయినా వెంబడించి యుగంధర్, బంధువులు వారిని కారు ఎక్కించారు. హేమంత్‌ పై పిడిగిద్దుల వర్షం కురిపిస్తూ.. రాత్రి 7.30 గంటల సమయంలో హత్య చేశారు. అవంతి రెడ్డిని కూడా విచక్షణ రహితంగా కొట్టినట్టు తెలుస్తోంది. అయితే, ఈ స్థాయిలో స్కెచ్ వేసిన లక్ష్మారెడ్డి-అర్చనలు ఏ సీన్‌లో కనిపించలేదు. తెరవెనుక ఉండి హేమంత్‌ను హత్య చేయించారని పోలీసులు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు.


Next Story

Most Viewed