చదువు పేరుతో ‘ప్రైవేటు’ దోపిడీ..

by  |
చదువు పేరుతో ‘ప్రైవేటు’ దోపిడీ..
X

దిశ, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆన్‌లైన్ క్లాసులు పేరిట ప్రైవేటు స్కూల్స్ విద్యార్థుల తల్లిదండ్రులను నిలువు దోపిడీ చేస్తున్నాయి. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం ఇటీవల ఆన్‌లైన్ క్లాసులకు అనుమతినిచ్చింది. దీంతో ప్రైవేటు స్కూల్ యజమాన్యాలు సరికొత్త దందాకు తెరలేపాయి. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు తరగతుల వారీగా నెలకు 1500 నుంచి 3 వేల వరకు వసూలు చేస్తున్నాయి.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రైవేటు స్కూల్స్ ఉన్నాయి. వీటి పరిధిలో విద్యార్థులు చదువుతున్నారు. ప్రతి ఏడాది జూన్ నెలలో మొదలు కావాల్సిన పాఠశాలలు ఈ ఏడాది కరోనా నేపథ్యంలో ఆలస్యమయ్యాయి. స్కూలు మూతపడడంతో ఎలాంటి రాత పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్ చేసింది. కొన్ని నెలలుగా ఇంటి పట్టునే విద్యార్థులు ఉండటంతో వారి భవిష్యతు దృష్ట్యా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సెప్టెంబర్ 1న ఆన్‌లైన్ క్లాసుల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వం క్లాసుల నిర్వహణకు కొన్ని మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. ముఖ్యంగా ప్రైవేటు యజమాన్యాలు ఫీజులు పేరుతో, పాతబకాయిల పేరుతో వేధింపులకు పాల్పడొద్దని స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. కానీ ప్రభుత్వ ఆదేశాలను కొంత ప్రైవేటు యజమాన్యాలు తుంగలో తొక్కుతున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులను ఫీజుల పేరుతో వేధింపులకు గురి చేస్తున్నాయి.

వసూళ్ల పర్వం..

భద్రాద్రి జిల్లాలో కొన్ని ప్రైవేటు యజమాన్యాలు కొత్త రకం దందాకు తెరలేపుతున్నారు. స్కూల్ బుక్స్ పేరుతో వసూలు చేయడమే కాకుండా వారు సిఫారసు చేసిన యాప్ కోడు పొందడానికి మరో మూడువేలు అదనంగా వసూలు చేస్తున్నారు. యాప్ కోడ్ తీసుకుందామని స్కూల్స్ కు వెళ్తున్న పిల్ల తల్లిదండ్రులకు పాతబకాయిల పేరుతో వేధింపులకు పాల్పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పాత బకాయిలు వసూలు చేయవద్దు చేపట్టినప్పటికీ ఎవరూ ఖాతరు చేయడం లేదు. ఇదేమిటని ప్రశ్నించిన పేరెంట్స్‌ను తమ నిబంధనలకు అంగీకరిస్తేనే మీ పిల్లలను పై తరగతులకు పంపుతామని బ్లాక్ మెయిల్‌కి చేస్తున్నారని వాపోతున్నారు.

పేరెంట్స్ ఆందోళన..

కరోనా నేపథ్యంలో చాలా మంది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే సమయంలో ప్రైవేటు యజమాన్యాలు పిల్లల స్కూల్ ఫీజులు చెల్లించాలని వేధింపులకు పాల్పడటంతో తలలు పట్టుకుంటున్నారు. తమ నిబంధనలకు అంగీకరిస్తేనే స్కూల్లో చేర్చుకుంటామని బెదిరింపులకు పాల్పడటంతో ఏమీ చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో పడ్డారు. కట్టకుండా కొంతకాలం వాయిదా వేద్దామన్నా యజమాన్యాలు అంగీకరించడం లేదు. పిల్లల భవిష్యత్తు కోసం నానా తిప్పలు పడి ఫీజులు కడుతున్నారు. పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టనట్టు వ్యవహరించడంతో ప్రైవేటు యజమాన్యాలు రెచ్చిపోతున్నాయి.

20వేలు వసూలు చేస్తున్నరు..

స్కూల్ నుంచి ఫోన్ వచ్చిందని వెళ్లాను. గతంలో సంవత్సరం ఫీజు 12 వేల రూపాయలు ఉంటే ఇప్పుడు ఆరు నెలలకే 20 వేలు వసూలు చేస్తున్నారు. ఒక గంట ఆన్‌లైన్ క్లాసులకు టెస్టులు, పుస్తకాలు చదివి హోం వర్క్ చేయాలంటున్నారు. కరోనా నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం. అంత మొత్తంలో ఫీజులు ఎలా చెల్లించాలో అర్థంకావడం లేదు.

– శ్యామల కొత్తగూడెం

ఫిర్యాదు రాలేదు : వెంకట్, కొత్తగూడెం ఎంఈఓ

ఆన్‌లైన్ విద్య గురించి, ప్రైవేటు యాజమాన్యాలు వసూలు చేస్తున్న ఫీజులకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదు అందలేదు. ఎవరైనా వచ్చి రాతపూర్వకంగా ఫిర్యాదు ఇస్తే ఉన్నత అధికారులకు సమాచారం ఇచ్చి చర్యలు చేసుకుంటాం.

ప్రస్తుతం వసూలు చేస్తున్న ఫీజులు

తరగతి బుక్స్ ఫీజు నెలవారీ ఫీజు జూమ్ యాప్ ఫీజు
ఒకటి 2000 2000 500
పది 6000 4000 1000

Next Story

Most Viewed