కాలుష్య నియంత్రణకు శాశ్వత పరిష్కారం చూపండి: సుప్రీంకోర్టు

by Shamantha N |
Air pollution
X

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్య నియంత్రణకు శాశ్వత పరిష్కారం చూడాలని సుప్రీంకోర్టు ఎయిర్ క్వాలిటీ కమిషన్‌ను కోరింది. కమిషన్ ఏర్పాటు చేసిన నిపుణల కమిటీ సలహాలు తీసుకోవాలని ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణతో కూడిన బెంచ్ సూచించింది. అంతకుముందు జరిగిన విచారణలో పలువురు వివిధ ఆంక్షలు మినహాయించాలని కోరారు. ఈ మేరకు కమిషన్‌కు దరఖాస్తులతో దానిని సంప్రదించాలని సుప్రీం సూచించింది. కాగా గురువారం, దరఖాస్తులు దాఖలు చేసిన వారందరితో చర్చలు జరిగాయని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా గురువారం కోర్టుకు తెలిపారు. ప్రాణాలను రక్షించే పరికరాలను తయారు చేసే కంపెనీలు డీజిల్ జనరేటర్లను ఉపయోగించడానికి అనుమతిస్తున్నట్లు చెప్పారు. దీంతో పాటు డైరీ, మెడికల్ తయారీకి కూడా అనుమతి ఉందని ఆయన వెల్లడించారు. అంతకుముందు పరిశ్రమలకు రోజుకు ఎనిమిది గంటలే పనిచేయాలన్న నిబంధనను మారుస్తున్నట్లు తెలిపారు. తాజా సవరణల్లో వారంలో ఐదు రోజులు పనిచేసే వెసులుబాటు కల్పించామన్నారు.

మూసివేసిన థర్మల్ పవర్ ప్లాంట్లు అలాగే కొనసాగుతున్నాయని, అయితే విద్యుత్ మంత్రిత్వ శాఖతో చర్చించినట్లుగా మరిన్ని మూసివేయబడవని మెహతా చెప్పారు. అన్ని ఆసుపత్రుల నిర్మాణాలకు అనుమతులు ఉండగా, మిగతా నిర్మాణాలకు మాత్రం కేవలం ఇంటీరియర్ వరకు మాత్రమే అనుమతించినట్లు తెలిపారు. అంతకుముందు కమిషన్ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. అనేక వర్గాల నుండి వచ్చిన వాదనలను పరిగణనలోకి తీసుకున్న తరువాత, కొన్ని పరిశ్రమలపై నిషేధాన్ని ఎత్తివేయాలని నిర్ణయించినట్లు తెలియజేసింది. సహజవాయువు వినియోగంలో వైఫల్యం కారణంగా మూతపడిన పరిశ్రమలు ఇప్పుడు రోజుకు ఎనిమిది గంటలు పనిచేయాలని నిర్ణయించినట్లు కమిషన్ తెలిపింది. అయితే విద్యాసంస్థలు ఆన్ లైన్ ద్వారానే బోధనలు చేయాలని, దీనిపై శుక్రవారం పున:సమీక్షించననున్నట్లు పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed